5జీ స్పెక్ట్రమ్ బకాయి ముందుగానే చెల్లించిన ఎయిర్‌టెల్!

by Disha Web Desk 16 |
5జీ స్పెక్ట్రమ్ బకాయి ముందుగానే చెల్లించిన ఎయిర్‌టెల్!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి మిగిలిన కంపెనీల కంటే దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో రూ. 43,039.63 కోట్ల విలువైన బిడ్లను దక్కించుకున్న ఎయిర్‌టెల్, స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి టెలికాం శాఖకు రూ. 8,312.4 కోట్లను చెల్లించినట్టు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఎయిర్‌టెల్ సంస్థ నాలుగేళ్ల 2022 స్పెక్ట్రమ్ బకాయిలను ముందస్తుగా చెల్లించినట్టు అయింది.

ఈ ముందస్తు చెల్లింపుతో నాలుగేళ్ల పాటు స్పెక్ట్రమ్ బకాయిలు, ఏజీఆర్(సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) సంబంధిత చెల్లింపుల మారటోరియంతో పాటు భవిష్యత్తు నగదు చెల్లింపులకు సంబంధించి ఒత్తిడి తగ్గుతుందని, పూర్తిస్థాయిలో 5జీ సేవలపై దృష్టి సారించడానికి వీలవుతుందని కంపెనీ వివరించింది. నాలుగేళ్ల ముందస్తు చెల్లింపు ద్వారా కంపెనీ నిర్వహణకు సంబంధించి నగదు భారం తగ్గి 5జీ సేవలను వేగవంతం చేయనున్నామని పేర్కొంది. త్వరలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 15,740.5 కోట్ల మూలధన నిధులను సేకరించనున్నామని తెలిపింది. తాజా నిర్ణయాల ద్వారా కంపెనీ మెరుగైన, నాణ్యమైన 5జీ సేవలందించనున్నామని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ మిట్టల్ అన్నారు.



Next Story