- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airlines: చమురు ధరలు తగ్గినా విమాన టికెట్లు తగ్గవా
అంతర్జాతీయంగా జెట్ ఇంధన ధరలు గాలన్కు 4.88 డాలర్ల నుంచి 2.85 డాలర్లకు పడిపోవడంతో, దేశీయంగా కూడా ఏటీఎఫ్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడం భారతీయ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి క్యారియర్లకు ఊరట లభించనుంది. దేశంలో ఒక విమానయాన సంస్థ నడవడానికి అయ్యే మొత్తం నిర్వహణ ఖర్చులలో ఒక్క ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వాటాయే దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. అంతర్జాతీయంగా జెట్ ఇంధన ధరలు గాలన్కు 4.88 డాలర్ల నుంచి 2.85 డాలర్లకు పడిపోవడంతో, దేశీయంగా కూడా ఏటీఎఫ్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల పెరిగిన ఇంధన ఖర్చులను భరిస్తూ తీవ్ర నష్టాలను, మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొన్న కంపెనీలకు ఈ ధరల పతనం వల్ల వేల కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి. ముఖ్యంగా విస్తరణ ప్రణాళికల్లో ఉన్న ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి దిగ్గజాల బ్యాలెన్స్ షీట్లు ఈ త్రైమాసికంలో బలపడటానికి ఇది అద్భుతమైన అవకాశంగా మారింది.
పండుగ సీజన్ ముంగిట కస్టమర్లకు తప్పని భారం
ఇంధన ధరలు తగ్గినప్పటికీ, భారతీయ ప్రయాణికులకు మాత్రం టికెట్ రేట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం, దేశీయ మార్కెట్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతున్నా, దానికి సరిపడా విమానాల లభ్యత లేకపోవడమే. ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్ల ఇప్పటికే వందలాది భారతీయ విమానాలు గ్రౌండ్కే పరిమితమయ్యాయి. విమానాల కొరత, విమానాశ్రయాలలో పరిమిత స్లాట్ల కారణంగా ఎయిర్లైన్స్ కంపెనీలు డిమాండ్ను బట్టి ఛార్జీలను యుద్ధానికి ముందు స్థాయి కంటే ఎక్కువగానే ఉంచుతున్నాయి. తగ్గిన ఇంధన లాభాలను ప్రయాణికులకు బదిలీ చేయకుండా, తమ పాత నష్టాలను పూడ్చుకోవడానికి, లాభాల మార్జిన్లను పెంచుకోవడానికి కంపెనీలు వాడుకుంటున్నాయి. కాబట్టి, రాబోయే పండుగలు, సెలవుల సీజన్లలో విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఏటీఎఫ్ ధరలు తగ్గినా కూడా జేబులు ఖాళీ అవ్వడం మాత్రం తప్పేలా లేదు.






