సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-15 02:49:47  IST  )

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై పడిన విషయం తెలిసిందే.

సామాన్యుడి జేబుకు చిల్లు.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం తాజాగా దేశీయ ఇంధన ధరలపై పడింది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా పెరగడంతో, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్‌పై రూ.3.42 పైసలు, డీజిల్‌పై రూ.3.26 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా పరిణామంతో హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.110.88కు, డీజిల్ ధర రూ.98.96కి చేరింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.63, డీజిల్ రూ.96.36గా, విజయవాడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.53, డీజిల్ రూ.101.17గా ఉంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినవచ్చనే ఆందోళనల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి చమురు సంస్థలు ఈ ధరల పెంపును వినియోగదారులకు మోపక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

సామాన్యులపై తీరని భారం..

ఇప్పటికే నిత్యావసర ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు, తాజా ఇంధన ధరల పెంపు అదనపు భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన ధరలు నేడు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తక్షణమే అమల్లోకి వచ్చేశాయి. స్థానిక పన్నులు (VAT) ఆధారంగా ఒక్కో రాష్ట్రంలో ఈ ధరల మార్పు స్వల్పంగా మారే అవకాశం ఉంది.

Next Story