- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India: 100 కోట్ల మంది భారతీయుల వద్ద అవసరానికి మించి ఖర్చు చేసేంత డబ్బు లేదు
100 కోట్ల మంది జనాభా వద్ద తమ అవసరానికి మించి వస్తువులు లేదా సేవల కోసం ఖర్చు చేసేంత సొమ్ము లేదని నివేదిక అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో కేవలం టాప్ 10 శాతం మంది మాత్రమే అవసరానికి మించి ఖర్చు చేయగలుగుతున్నారని ఓ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వృద్ధిని, వినియోగాన్ని కూడా నడిపిస్తున్నది ఆ 10 శాతం మంది మాత్రమేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రముఖ వెంచర్ కేపిటల్ కంపెనీ బ్లూమ్ వెంచర్స్ 'ఇండస్ వ్యాలీ వార్షిక నివేదిక-2025' పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 100 కోట్ల మంది జనాభా వద్ద తమ అవసరానికి మించి వస్తువులు లేదా సేవల కోసం ఖర్చు చేసేంత సొమ్ము లేదని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా దేశంలోని స్టార్టప్లు, వ్యాపారాలకు ఆదాయం అందించే వినియోగ తరగతి ప్రజలు 13-14 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.
మరో 30 కోట్ల మంది ఇంకా పూర్తిగా అవసరానికి మించి ఖర్చు చేసే స్థాయిలో లేరు. వీరు యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల కారణంగా ఇప్పుడిప్పుడే ఖర్చు చేయడం మొదలుపెట్టారు. దేశంలోని ఈ వినియోగ తరగతి ప్రజల సంఖ్యలో పెరుగుదల గానీ, తరుగుదల గానీ లేదని నివేదిక పేర్కొంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, భారత్లోని ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు కానీ కొత్త ఎవరూ సంపన్నులు కావడంలేదని నివేదిక వివరించింది.
ముఖ్యంగా దేశంలో 'ప్రీమియమైజేషన్' ధోరణి వేగవంతం అవుతోంది. అంటే, బ్రాండెడ్ కంపెనీలు అధిక జనాభా కొనుగోలు చేసే మార్కెట్పై దృష్టి సారించడం కంటే సంపన్నులకు అందించే ఖరీదైన, అప్గ్రేడ్ చేసిన ఉత్పత్తులను రెట్టింపు అందుబాటులో ఉంచడంపై ఆసక్తిగా ఉన్నాయి. ఉదాహరణకు దేశంలో హై-ఎండ్ మొబైల్ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇదే సమయంలో బేస్-వేరియంట్ల అమ్మకాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు, దేశంలో ఆదాయ అసమానతలు కూడా బాగా పెరిగాయని నివేదిక చెబుతోంది.
1990లో టాప్ 10 శాతం ప్రజల వద్ద 34 శాతం జాతీయ ఆదాయం ఉంటే, 2025 నాటికి ఇది 57.7 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో దిగువ నుంచి సగం జనాభా జాతీయ ఆదాయంలో తమ వాటాను( 1990-2025 మధ్యకాలంలో) 22.2 శాతం నుంచి 15 శాతానికి కోల్పోయారు. ఫలితంగా, గత పదేళ్లలో ప్రధాన ఆర్థికవ్యవస్థల కంటే మెరుగైన వినియోగ వృద్ధిని సాధించిన భారత్, తలసరి వినియోగ వ్యయంలో ఇప్పటికీ చైనా కంటే 13 ఏళ్ల వెనుకబడిందని నివేదిక పేర్కొంది.
దేశంవ్యాప్తంగా వినియోగం తగ్గడానికి కొనుగోలు శక్తి క్షీణించడం మాత్రమే కాకుండా, ఆర్థిక పొదుపు తగ్గడం, పెరిగిన అప్పులు కూడా కారణమని నివేదిక అభిప్రాయపడింది. ఈ కారణంగా కొవిడ్-19 మహమ్మారి తర్వాత డిమాండ్ను పెంచిన అన్సెక్యూర్డ్ లోన్లపై ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొవిడ్ తర్వాత వినియోగ తరగతి ప్రజల్లో పెరిగిన ఖర్చులు ప్రధానంగా ఇలాంటి రుణాలు తీసుకోవడం ద్వారానే జరిగాయని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ చర్యలతో ఇప్పుడు వినియోగంపై ప్రభావం కనిపిస్తోందని స్పష్టం చేసింది.
అయితే, ఇటీవల కేంద్ర బడ్జెట్లో రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పంట దిగుబడి రికార్డు స్థాయిలో రావడంతో డిమాండ్ను పెంచుతుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా వినియోగం పెరిగి జీడీపీకి 0.5 శాతం మేర మద్దతిస్తుందని నివేదిక వెల్లడించింది.






