జన వాడ గ్రామానికి బస్సులు నడిపించాలని.. విద్యార్థుల రాస్తారోకో..

by  |
జన వాడ గ్రామానికి బస్సులు నడిపించాలని.. విద్యార్థుల రాస్తారోకో..
X

దిశ, శంకర్‌పల్లి: శంకర్పల్లి గండిపేట్ రోడ్డుపై జనవాడ గేటు వద్ద తమ గ్రామానికి బస్సులు నడిపించాలని.. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం శంకర్‌పల్లి గండిపేట రోడ్డుపై విద్యార్థులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. మెహదీపట్నం డిపో నుంచి తమ గ్రామానికి గతంలో బస్సులు నడిచేవన్నారు. అయితే కరోనా సమయంలో బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని గ్రామాలకు బస్సును ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు తమ గ్రామానికి బస్సులు నడిపించక పోవడంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని విద్యార్థులు వాపోయారు.

జనవాడ గ్రామం నుంచి నార్సింగి, లంగర్ హౌస్, మెహదీపట్నం తో పాటు నగరంలోని వివిధ స్కూల్‌లకు, కళాశాలలకు, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలకు సుమారు 300 మంది విద్యార్థులు వెళ్తుంటారు. ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించక పోవడంతో రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన జన‌వాడ గేట్ వరకు వచ్చి బస్సు ఎక్కి వెళ్లాల్సి వస్తుందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. మెహదీపట్నం డిపో మేనేజర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా బస్సులను పునరుద్ధరించడం లో ఘోరంగా విఫలమయ్యాడని విద్యార్థులన్నారు . విద్యార్థులు పెద్ద ఎత్తున జన వాడ గేటు వద్ద చేస్తున్న రాస్తారోకో ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

పోలీసులు ఎంత చెప్పిన విద్యార్థులు వినలేదు. దీంతో శంకర్‌పల్లి మెహదీపట్నం మధ్యన రెండు వైపుల కిలోమీటర్ల దూరం బస్సులు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నార్సింగ్ పోలీసులు మెహదీపట్నం డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యను వివరించగా డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించడం తో విద్యార్థులు ధర్నా విరమించారు. ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు బీర్ల శివ, మల్లెల కిషోర్, వడ్ల మహేష్ చారి, భోగం సత్యనారాయణ, కుమ్మరి రాజు, కుమ్మరి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Next Story