అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల బాధలు పట్టవా..

by  |
అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల బాధలు పట్టవా..
X

దిశ ,ఆత్మకూర్ : హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడు జంక్షన్ వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది. ఈ స్థితిలో జరగకూడనిదేదైనా జరిగితే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది వాహనదారులు ఈ బస్ షెల్టర్‌ను పార్కింగ్ అడ్డగా, కొందరు చిరు వ్యాపారులు షాపింగ్ కాంప్లెక్స్ గా ఉపయోగిస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తుండడం, కోరి ప్రమాదం బారిన పడటమేనని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన బస్ షెల్టర్‌ను డిస్మెటల్ చేసి ప్రయాణికుల సౌకర్యార్థం మరో బస్ షెల్టర్ నిర్మించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

బస్సు కోసం ఎండలో, వానలో ఎదురుచూపులు..

దశాబ్దాల క్రితం నిర్మించిన బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు బస్సుల కోసం ఎండలో, వానలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఈ క్రమంలో షాపుల ముందు నిలబడితే ఛీత్కారాలు సైతం భరించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. నిత్యం వందలాది ప్రయాణికులతో పరకాల టు ములుగు, ములుగు టు పరకాల రూట్లలో ప్రయాణం చేయాల్సి వస్తే ఈ జంక్షన్‌లో కచ్చితంగా బస్సు మారాల్సిందే. దీంతో ఈ జంక్షన్ ప్రయాణికులతో నిత్యం రద్దీగానే ఉంటుంది. అలాంటిది ఈ జంక్షన్‌లో బస్సు షెల్టర్ లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సెంటర్లో ఆయా రూట్లలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed