అద్దెకు బీఎస్ఎన్ఎల్ భవనాలు.. త్వరలో అమ్మకం..?

by  |
అద్దెకు బీఎస్ఎన్ఎల్ భవనాలు.. త్వరలో అమ్మకం..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : ప్రభుత్వ భూములను అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోగా.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ లాంటి ప్రభుత్వ సంస్థలను సగం ప్రైవేటు పరం చేసింది కూడా. ఎల్‌ఐసీ, రైల్వే, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, రవాణా లాంటి కీలక రంగాలను ప్రైవేటీకరణకు కేంద్రం పూనుకుంది. తాజాగా నష్టాల్లోకూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ టెలికామ్ శాఖ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సంస్థను సైతం ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర పరిధిలోని ఆ శాఖ సొంత బిల్డింగులలో ఉన్న స్థలాల్లో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 15 బిల్డింగ్‌లను కిరాయికి ఇచ్చి లోటు బడ్జెట్ ను భర్తీ చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే కార్యాలయ గేట్లకు టు లెట్ బోర్డులు తగిలించారు. త్వరలో బీఎస్ఎన్‌ఎల్ భూములను సైతం అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

అద్దెకు బీఎస్ఎన్ భవనాలు …

నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి తెచ్చేందుకు గాను ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ భవనాలను అద్దెకిచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 2, సిద్దిపేట జిల్లాలోని 4 బిల్డింగ్‌లను అద్దెకు ఇవ్వనున్నారు. మొత్తం 15 బిల్డింగ్ లను అద్దెకు ఇచ్చేందుకు టెండర్లు నిర్వహించింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అడ్మిన్ బిల్డింగ్, రామాయంపేట, గజ్వేల్, దుబ్బాక బీఎస్ఎన్ఎల్ బిల్డింగ్‌లతో పాటు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి అడ్మిన్ బిల్డింగ్, జియో (సౌత్ బిల్డింగ్), పటాన్ చెరు, సదాశివపేట, బొల్లారం, జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, గుమ్మడిదల, మెదక్ జిల్లాలోని మెదక్ అడ్మిన్ బిల్డింగ్, నర్సాపూర్ భవనాలు అద్దెకు ఇవ్వబడునని టు లెట్ బోర్డులు తగిలించారు.

అద్దెకిచ్చేందుకు టెండర్లు పిలిచిన కేంద్రం…

ప్రభత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన కార్యాలయాలను అద్దెకిచ్చేందుకు రెడీ అవగా, ఆయా భవనాలలోని కొంత స్థలాన్ని టెండర్ల రూపంలో అద్దెకు ఇస్తామని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుల కార్యాలయాల ముందు టు లెట్ బోర్డులు తగిలించి ఉంచారు. ఇదిలా ఉంటే క్రమంగా ఉద్యోగుల సంఖ్య తగ్గడం, పెద్ద పెద్ద బిల్డింగ్‌లలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండండంతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు టెలికాం శాఖ అధికారులు తెలిపారు.

త్వరలో భూముల అమ్మకం …

బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలను అద్దెకివ్వడమే కాదు. బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించిన ప్రభుత్వ స్థలాలను త్వరలో అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన ఖాళీగా ఉన్న స్థలాల గుర్తింపు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఇలా జరిగితే అతి త్వరలో బీఎస్ఎన్ఎల్ కనుమరుగుకానుందని ప్రముఖులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు..

కేంద్రంలో ఉన్న బీజేపీ తీరుపై కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులతోపాటు సామాన్య ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తుందంటూ విమర్శిస్తున్నారు. తాజాగా టెలికాం సంస్థ కార్యాలయాలను అద్దెకివ్వడం, త్వరలో భూముల అమ్మకానికి సిద్ధమైందన్న సమాచారం తెలుసుకున్న వినియోగదారులు కేంద్రం తీరును ఖండిస్తున్నారు. వెంటనే అద్దెకిచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బీఎస్ఎన్ఎల్ సంస్థ అభివృద్ధి చేసే కార్యక్రమాలను రూపొందించాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed