లాక్‌డౌన్‌తో ‘లైవ్‌’లో బీఎస్ 4 వెహికిల్స్!

by  |
లాక్‌డౌన్‌తో ‘లైవ్‌’లో బీఎస్ 4 వెహికిల్స్!
X

దిశ, న్యూస్‌ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలు ప్రారంభం కావడంతో బీఎస్ 4 వాహనాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిజానికి బీఎస్ 4 వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ గడువు మార్చి 31తో ముగిసింది. అయితే, అదే నెల 21న తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కాకుండా 2 లక్షలకు పైగా ఉన్న పాత, కొత్త బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ సందిగ్ధంలో పడింది. దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొని ఆన్‌లైన్ పద్ధతిలో పన్ను చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని వాహనానికి నెంబర్ తీసుకోవచ్చని ప్రకటించారు. లాక్‌డౌన్ తర్వాత వాహనం సంబంధిత ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చి వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుందని చెప్పారు. ఈ పద్ధతిలో చాలా మంది తమ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ కాని బీఎస్ 4 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది. మరోపక్క ఇప్పటికీ కొన్ని వందల వాహనాలు రిజిస్ట్రేషన్ అవకుండా పెండింగ్‌లో ఉన్నట్లుపలువురు రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలోని గ్రీన్, ఆరెంజ్, రెండ్ జోన్లలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, కేవలం మార్చి 23న రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌కు ముందు డీలర్లు అమ్మిన బీఎస్ 6 వాహనాలకు మాత్రమే ఆర్టీఏ‌ల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలి ఉన్న బీఎస్ 4 వాహనాల అంశంపై అధికారులు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో మళ్లీ ఎవరైనా పిటిషన్లు వేసి తీర్పులు వస్తే కానీ, తాము రిజిస్ట్రేషన్లు చేయలేమన్న ఉద్దేశంతో వారున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ప్రభావంతో మార్చిలో 10 రోజులు బీఎస్ 4 వాహనాలు విక్రయించుకునే అవకాశం కోల్పోయామన్న అంశంపై అత్యున్నత న్యాయ‌స్థానం అప్పట్లో వాహన డీలర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఏప్రిల్ 14తో మొదటి దశ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాలు అమ్ముకోవచ్చని అప్పట్లో కోర్టు వారికి ఊరటనిచ్చింది. అయితే, అది డీలర్లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అని దాంట్లో రిజిస్ట్రేషన్ల అంశం ఎక్కడా లేదని పైగా ఏప్రిల్ 14 తర్వాత సైతం లాక్‌డౌన్ పొడిగించడంతో ఆ తీర్పుపై ముందుకెళ్లలేమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అమ్ముడవకుండా డీలర్ల దగ్గర మిగిలి ఉన్న బీఎస్ 4 వాహనాలు, రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయిన వాహనాల అంశాల్లో తదుపరి కోర్టు తీర్పు వస్తేనే పరిష్కారం లభిస్తుందని స్పష్టమవుతోంది.

అంతంతమాత్రంగా రవాణా శాఖ ఆదాయం..

లాక్‌డౌన్ తర్వాత రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. వీటిలో ఆర్టీఏ కార్యాలయాల్లో అందే వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సులు, పర్మిట్ల జారీ సేవలు రాష్ట్ర ఖజానా నింపడానికి నాలుగో అతిపెద్ద వనరుగా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది వాహన రిజిస్ట్రేషన్ సమయంలో చేసే లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు. ఇవి గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్ల దాకా వసూలైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు ఎక్కువగా జరిగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కరోనా కేసుల్లో రెడ్‌జోన్‌లో ఉండటంతో ఇక్కడ వాహన డీలర్ల షోరూములు తెరచుకోలేదు. దీంతో ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్ర రవాణా శాఖకు రోజుకు సగటున రావాల్సిన రూ.9 కోట్ల ఆదాయంలో శుక్రవారం కేవలం రూ.2.8 కోట్లు మాత్రమే వచ్చింది. అంతేగాక కరోనా వ్యాప్తి నిరోధానికిగాను ఆర్టీఏ కార్యాలయానికి కొద్ది మందే రావడానికి వీలుగా తక్కువ స్లాట్లనే అధికారులు కేటాస్తుండటంతో పన్ను వసూళ్లు తగ్గాయి. కాగా, ఈ నెల 15 తర్వాత సడలింపులపై సీఎం సమీక్ష తర్వాత హైదరబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వాహన షోరూంలు తెరచుకోవడంపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags: telangana, lockdown, bs4 vehicle, transport department, tax collection



Next Story

Most Viewed