అన్నదమ్ములను బలిగొన్న పాల వ్యాన్

by  |
Milk Van
X

దిశ, వెబ్‌డెస్క్ : వనపర్తి జిల్లాలో పాల వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పాలవ్యాన్ డ్రైవర్ వాహనాన్ని అజాగ్రత్తగా, అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడం విషాదాన్ని నింపింది.

హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి కుమారులు సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఓటు వేయడానికి ఆదివారం స్వగ్రామానికి వచ్చారు. సోమవారం ఉదయం స్వగ్రామంలో సొంత పొలాలను పరిశీలించడానికి నలుగురు అన్నదమ్ములు సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పరమేశ్వరెడ్డి, లోకారెడ్డి కలసి పొలం వద్దకు వెళ్లారు. పొలాల పరిశీలన అనంతరం ఇద్దరు అన్నదమ్ములు పరమేశ్వర్ రెడ్డి, లోకారెడ్డి ద్విచక్ర వాహనంపై ముందు అమ్మాయిపల్లికి వెళ్లారు. కాగా, సాయిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి కాలినడకన వస్తుండగా.. పెబ్బేరు వైపు వెళ్తున్న పాల వ్యాన్ ఒక్కసారిగా వారిద్దరి పైనుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


Next Story