బరువు తగ్గితే ప్రోత్సాహకాలు

by  |
బరువు తగ్గితే ప్రోత్సాహకాలు
X

దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలంలో చాలామంది బరువు పెరిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సమయంలో జనాలు జంక్‌ఫుడ్‌కు బాగా అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే యూకేలో ఒబెసిటీపై ఓ సర్వే నిర్వహించగా ముగ్గురిలో ఒకరు అధిక బరువు కలిగి ఉన్నారని, సగటున ఒక్కొక్కరు 4 కిలోలు పెరిగినట్లు అక్కడి ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)’ అంచనా వేసింది. దీంతో ప్రభుత్వం జంక్‌ఫుడ్ ప్రకటనలు పరిమితం చేస్తూ.. ఆహార పదార్థాల్లో ఉండే క్యాలరీల వివరాల్ని అందరికీ తెలియజేసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ కోర్టులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, టీవీల్లోనూ ఈ తరహా యాడ్స్ ఇస్తోంది. అంతేకాదు బరువు తగ్గినవారికి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందిస్తామని తెలిపింది.

యూకే ప్రభుత్వం బరువు తగ్గే వారికి బంపర్ ఆఫర్స్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందిస్తోంది. ఈ మేరకు ఎవరైతే జంక్‌ఫుడ్‌ను తగ్గించి.. కూరగాయాలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారికి లాయల్టీ పాయింట్లు ఇస్తారు. ఇక వాహనం ఉపయోగించకుండా కాలినడకన వెళ్లినా బోనస్ పాయింట్లు లభిస్తాయి. డిస్కౌంట్లు, ఉచిత టిక్కెట్లు లేదా ఇతర ప్రోత్సాహకాల కోసం ఈ పాయింట్లను మార్పిడి చేసుకోవచ్చు. ఒబెసిటీపై పోరాటంలో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గతేడాది కోవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరినా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా బరువు పెరగగా, ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుండగా, యాప్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.



Next Story

Most Viewed