పేదరిక అవమాన సంస్థగా మెప్మా!

by  |
పేదరిక అవమాన సంస్థగా మెప్మా!
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్‌లోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో వసూళ్ల పర్వం నడుస్తోందనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. అది పేదరిక నిర్మూలన సంస్థ కాదని.. పేదరిక అవమాన సంస్థ అనే విధంగా దిగజారిందని స్థానికులు మండిపడుతున్నారు. అయితే చిరు వ్యాపారుల బ్రతుకుల్లో కొంత ఊరటగా ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. ఇందుకోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటారు. మొత్తం జిల్లా కేంద్రంలో 3, 464 మందికి రుణాలు ఇవ్వడానికి అధికారులు దరఖాస్తు తీసుకుంటున్నారు. ఈ పని అంతా మెప్మా అధికారులకు అప్పజెప్పారు.. కానీ, ఆన్‌లైన్‌ను ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో అదనపు ఖర్చులకు ఒక్కో దరఖాస్తునకు రూ.45తీసుకోవాల్సి ఉండగా.. రూ. వెయ్యి వరకూ వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

స్పందించిన అధికారులు..

దాదాపుగా రూ. 8 లక్షలు దండుకోవడానికి ప్రైవేట్ దుకాణం తెరిచిన మెప్మాపై ఆర్డీవో దేవరాయి కొమురయ్య మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్, మున్సిపాలిటీ చైర్మన్ డా. పాల్వాయి దామోదర్ రెడ్డి స్పందించారు. చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా చూస్తామని, ఎవరైనా రూ.45 కంటే ఎక్కువ తీసుకుంటే కంప్లైంట్ చేయాలన్నారు. ఇదంతా మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయంలోని మెప్మా ఆఫీస్‌లో జరుగుతోందని దరఖాస్తు దారులు లబోదిబోమంటుంటే.. కంప్లైంట్ చెయ్యండి చర్యలు తీసుకుంటామని చెప్పడమేంటని పలువురు మండిపడుతున్నారు. ప్రైవేట్ దందాకు తెరతీసిన అధికారులపై చర్యలు తీసుకోకుంటే పట్టణం పేదరిక నిర్మూలన సంస్థ కాస్తా పేదరిక అవమానాల సంస్థగా మారే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story