ఎయిర్ఇండియాను సొంతం చేసుకున్న టాటా సంస్థ!

by  |
Air india Tata sons
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా ఎవరి సొంతం కానున్నదనే సందేహాలకు ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గత వారం ఎయిర్ఇండియా టాటా సొంతం అని ఊహాగానాలనే నిజం చేస్తూ శుక్రవారం కేంద్రం టాటా సన్స్ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచిందని ప్రకటించింది. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియా కోసం పలు కంపెనీలు బిడ్లను దాఖలు చేయగా, ఎట్టకేలకు 68 ఏళ్ల నిరీక్షణ తర్వాత టాటా గ్రూపునకే ప్రభుత్వం కట్టబెట్టింది. ఎయిర్ఇండియాను టాటా సన్స్ సొంతం చేసుకున్న విషయాన్ని కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే అధికారికంగా ప్రకటించారు.

ఎయిర్ఇండియాను కొనేందుకు సెప్టెంబర్ 29న వివిధ కంపెనీలు ఫినాన్స్ బిడ్లను దాఖలు చేయగా, ఇందులో ఎయిర్ఇండియా అప్పుల కోసం 85 శాతం, నగదు రూపంలో 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. టాటా సన్స్‌తో పాటు స్పైస్‌జెట్‌కు చెందిన అజయ్ సింగ్ ఫైనాన్స్ బిడ్లను సమర్పించారు. ఎయిర్ఇండియాను దక్కించుకునేందుకు టాటా సన్స్‌ సంస్థ రూ. 18,000 కోట్లను వెచ్చించనుంది. ఆసక్తికరంగా ఎయిర్ఇండియా సంస్థను 1932లో టాటా గ్రూప్ సంస్థే స్థాపించింది. ఆ తర్వాత 1953లో జాతీయం చేయడంతో ప్రభుత్వ సంస్థగా మారింది. అనంతరం 1977లో ఎయిర్ఇండియా నిర్వహణలో కీలకంగా వ్యవహరించింది. తాజాగా 68 ఏళ్ల తర్వాత అదే సంస్థ సొంత సంస్థను స్వాధీనం చేసుకుంది.


Next Story