పెద్ద శేషవాహనంపై శ్రీ మలయప్ప స్వామి

by  |
పెద్ద శేషవాహనంపై శ్రీ మలయప్ప స్వామి
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై శుక్రవారం రాత్రి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి అలంకారంలో అనుగ్రహించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం… స‌ర్పానాం అస్మి వాసుకిః… తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆదిశేషుడు త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోస్తుంటారు.

ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యాగ‌శాల‌లో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం బంగారు తిరుచ్చిపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామిని ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. తర్వాత రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఆస్థానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో కేఎస్జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అర్చకులు కంక‌ణ‌ధార‌ణ చేశారు.

శ‌నివారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు చిన్న శేష వాహ‌నం, రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు హంస వాహ‌నంపై స్వామివారు దర్శనమిస్తారు. కార్యక్రమంలో పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, జెఈవో పీ బ‌సంత్ కుమార్‌, బోర్డు స‌భ్యులు డీపీ అనంత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, చిప్పగిరి ప్రసాద్, గోవింద‌హ‌రి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీరు ర‌మేష్‌రెడ్డి, డిప్యూటీ ఈవో హ‌రీంద్రనాథ్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.



Next Story