బోర్డర్స్ క్లోజ్.. ప్రతాపం చూపిన పోలీసులు

by  |
Lockdown
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పోలీసు శాఖ జోష్ పెంచింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో హైదరాబాద్ నగరం సహా అనేక జిల్లాల్లో ఎస్పీలు, పోలీసు కమిషనర్లు జోరు పెంచారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేశారు. అనుమతి లేకుండా తిరుగుతున్నవారిపై లాఠీలు ఝళిపించారు. నకిలీ పాస్‌లు, కాలం చెల్లిన ఈ-పాస్‌లతో తిరుగుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రోడ్లను పోలీసులు మూసివేశారు. బోర్డర్‌లన్నీ క్లోజ్ అయ్యాయి.

కేవలం ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులు, మెడికల్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆదివారం నుంచి రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల వరకు మాత్రమే సరుకు రవాణా వాహనాలకు రోడ్లపై తిరగడానికి అనుమతి ఇస్తున్నట్లు హైదరాబాద్ నగరంలోని ముగ్గురు పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం పది గంటల తర్వాత అనుమతి లేని వాహనాలు రోడ్లమీదకు వస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నగరంలోని పలు రోడ్లమీద విచ్చలవిడిగా నకిలీ పత్రాలతో తిరుగుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తగిన అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

Lockdown2

కఠినంగా లాక్‌డౌన్

లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడంలో భాగంగా శనివారం ఉదయం పది గంటల తర్వాత రోడ్లమీదకు వచ్చిన వాహనాలను సాయంత్రం వరకూ సీజ్ చేసి ఓపెన్ గ్రౌండ్‌‌లలో ఉంచారు. సాయంత్రం వాటిని వదిలిన తర్వాత తీసుకెళ్ళడానికి వచ్చిన ప్రజలతో సాధారణ రోజుల్లోకంటే ఎక్కువ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వీడియో సందేశాన్ని ప్రజల్లోకి విడుదల చేసి లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు. ఆదివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్ తీవ్రంగా ఉంటుందని, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని నొక్కిచెప్పారు.

ఫుడ్ డెలివరీ బాయ్స్ అవసరాల కోసమంటూ అనుమతి రోడ్డెక్కిన యువకులను పోలీసులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పోలీసు చెక్‌పోస్టులు, తనిఖీలను ఉల్లంఘించి వేగంగా వెళ్తున్నవారిపై లాఠీలు వినియోగించారు. డ్యూటీలో లేకపోయినప్పటికీ స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ దుస్తులు ధరించి రోడ్ల మీద తిరుగుతున్నవారిని అదుపులోకి తీసుకుని సాయంత్రానికి వదిలేశారు.

పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు

నిబంధనలను ఉల్లంఘిస్తూ కాలక్షేపం కోసం రోడ్లమీదకు వస్తున్న ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఎమర్జెన్సీ అవసరాలకు రోడ్డెక్కినవారికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆన్‌లైన్‌లో ఈ-పాస్ తీసుకోడానికి కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో సామాజిక సేవలకు అంతరాయం కలిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ఇవ్వడానికి వెళ్తున్నవారి విషయంలో పోలీసులు అనాలోచితంగా వ్యవహరించడంతో ఇబ్బందులు పడినవారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. తలస్సేమియా పేషెంట్లకు రక్తం ఇవ్వడానికి వెళ్తున్న వ్యక్తుల్ని కూడా పోలీసులు ఆపివేశారు. ఈ-పాస్ తీసుకోడానికి ఆన్‌లైన్‌లో తగిన ఆప్షన్ లేకపోవడంతో దాన్ని పొందలేకపోయారు.

హోమ్ ఐసొలేషన్‌లో ఉన్న వృద్ధ దంపతులకు ఫుడ్ ఇవ్వడానికి వెళ్ళే స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో డెలివరీ బాయ్స్ ధర్నా చేశారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోలీసుల కొత్త ఆంక్షలను తప్పుపట్టారు. సొంత నిర్ణయాలతో ఇబ్బందులు పెట్టడం సహేతుకం కాదని ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.


Next Story

Most Viewed