మహారాష్ట్ర హోం మినిస్టర్‌పై సీబీఐ ఎంక్వైరీ – బాంబే హైకోర్టు ఆదేశం

by  |
మహారాష్ట్ర హోం మినిస్టర్‌పై సీబీఐ ఎంక్వైరీ – బాంబే హైకోర్టు ఆదేశం
X

ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ దర్యాప్తుకు బాంబే హైకోర్టు ఆదేశించింది. హోం మినిస్టర్‌పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లో ప్రాథమిక విచారణను మొదలుపెట్టాలని తెలిపింది. సస్పెన్షన్ వేటుకు గురైన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేను రెస్టారెంట్లు, బార్లు, ఇతర మార్గాల్లో నెలకు రూ. 100 కోట్ల వసూళ్లు చేయాలని హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ హుకూం జారీ చేశారని ఆరోపణలు చేస్తూ పరమ్ వీర్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖ సంచలనాన్ని రేపింది.

ఈ లేఖలో సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది జయశ్రీ పాటిల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ గిరీశ్ ఎస్ కులకర్ణిల ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తూ ‘ఆరోపణల్లో నిజానిజాలను నిర్ధారించడానికి నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరముందని పిటిషనర్‌తో తాము అంగీకరిస్తున్నాం. దర్యాప్తు చేయమని రాష్ట్ర పోలీసులను ఆదేశిస్తే ఆ ఎంక్వైరీ స్వతంత్రంగా జరుగుతుందని భావించలేం. ఎందుకంటే అనిల్ దేశ్‌ముఖ్ స్వయంగా హోం మినిస్టరు. అందుకే వాస్తవాలు తేలాలంటే ఈ ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తునకు సీబీఐ డైరెక్టర్‌ను అనుమతించడం ఉత్తమం. ఆ దర్యాప్తును సీబీఐ 15 రోజుల్లో మొదలుపెట్టాలి. మరో 15 రోజుల్లో ప్రాథమిక విచారణను ముగించాలి’ అని ఆదేశించింది.

Next Story

Most Viewed