‘వ్యాక్సినేషన్ సర్జికల్ స్ట్రైక్‌లా చేయాలి’

by  |
‘వ్యాక్సినేషన్ సర్జికల్ స్ట్రైక్‌లా చేయాలి’
X

ముంబై: టీకా పంపిణీపై బాంబే హైకోర్టు బుధవారం కీలక సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ ఒక సర్జికల్ స్ట్రైక్‌లా ఉండాలని తెలిపింది. సరిహద్దులో నిలబడి వైరస్ వచ్చే వరకు వేచి ఉండే ధోరణి సరికాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివాసాలకు సమీపంలో టీకా పంపిణీ కేంద్రాల(నియర్ టు హోమ్) విధానంపై ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కుల్‌కర్ణిల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నియర్ టు హోమ్ టీకా పంపిణీ కేంద్రాల ద్వారా వైరస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నట్టు ఉన్నదని పేర్కొంది. ‘కరోనా మన అతిపెద్ద శత్రువుగా ముందు కేంద్రం అంగీకరించాలి. టీకా కేంద్రాలకు రాలేని కొన్ని ఏరియాలలో లేదా కొందరిలో కరోనా సోకి ఉండవచ్చు. అలాంటప్పుడు శత్రువు కరోనా కోసం ఎదురుచూడకుండా మీరే స్వయంగా వారి దగ్గరకు వెళ్లి టీకా వేసేలా కార్యక్రమం ఉండాలి. సర్జికల్ స్ట్రైక్‌లా వ్యాక్సినేషన్ ఉండాలి.

కానీ, మీరు వైరస్ క్యారియర్ మీ దగ్గరకు వచ్చే వరకు వేచి ఉంటున్నారు. శత్రువు(వైరస్) ప్రాంతాలకు వెళ్లడం లేదు’ అని పేర్కొంది. డోర్ టు డోర్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని, ఇప్పటికే కేరళ, జమ్ము కశ్మీర్, ఒడిశా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కొన్ని వర్గాల వారికి ఈ విధానంలో వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రస్తావించింది. ఇలాంటి ప్రతిపాదనను అనుమతి కోసం రాష్ట్రాలు ముందుకు తెస్తే వెంటనే పర్మిషన్ ఇవ్వాలని తెలిపింది. 75ఏళ్లు పైబడినవారికి, వీల్ చైర్‌కు, బెడ్‌కు పరిమితమైన వికలాంగులకు ఇంటికి వచ్చి టీకా పంపిణీ చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం వాదనలు వింటున్నది. ధర్మాసనం వ్యాఖ్యలపై కేంద్రం తరఫు వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ స్పందించారు. దేశమంతటికీ సరిపడేలా సవరించిన నూతన పాలసీతో కేంద్రం త్వరలోనే ముందుకు వస్తున్నదని వివరించారు.



Next Story

Most Viewed