టెర్రర్ లింక్స్.. ఇంటెలిజెన్స్ సెల్ అదుపులో తెలంగాణ యువకుడు

by  |
టెర్రర్ లింక్స్.. ఇంటెలిజెన్స్ సెల్ అదుపులో తెలంగాణ యువకుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకాలపాలకు పాల్పడి ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవిస్తున్న యువకుడు బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యాడు. అతని గురించి సౌదీ ప్రభుత్వం ఆరా తీయగా సదరు యువకుడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రెంజల్ బేస్‌కు చెందిన వాడిగా గుర్తించి భారత ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో హైదరాబాద్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు సంబంధించిన ఓ డీఎస్పీ, ఇద్ధరు సీఐల ఆధ్వర్యంలోని బృందం సదరు యువకుడిని బోధన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో ISI మూలాలు, ఈ ఏడాది ప్రథమార్ధంలో రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇప్పించిన ఘనతతో పాటు బోధన్‌లో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధమున్న యువకుడిని ఇంటెలిజెన్స్ సెల్ వారు పట్టుకుపోవడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

వివరాల్లోకివెళితే.. బోధన్ రెంజల్ బేస్‌కు చెందిన కుటుంబంలో ముగ్గురు సోదరులుండగా, అందులో ఒక యువకుడు ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడే ఉపాధి పొందుతున్న సమయంలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి అక్కడ ప్రభుత్వ వ్యతిరేక తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని అక్కడి ప్రభుత్వం గుర్తించి యువకుడిని అరెస్టు చేసి జైలులో వేసింది. శిక్ష అనుభవించిన సదరు యువకుడు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఎవరికీ కనిపించకుండా పోయాడు. దానితో అక్కడి నిఘా వర్గాలు ఆరా తీయ్యడంతో సదరు యువకుడు సౌదీ అరేబియాను వదిలి వెళ్లిన విషయం తెలియడంతో ఇండియాకు చెందిన ఇంటలిజెన్స్ సెల్ అధికారులకు సమాచారం అందించారు. నిజామాబాద్ సీపీకి ముందస్తుగా సమాచారం అందటంతో ఆ వ్యక్తిని అదపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రెండవ విడిత లాక్ డౌన్ ఎత్తివేత సమయంలో ఈ ఘటన జరిగినా ఇక్కడి నిఘా వర్గాలు ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. అసలు రేంజల్ బేస్‌లో సైతం ఫలానా యువకుడు సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొని అక్కడ జైలు శిక్ష అనుభవించిన విషయం, పరారీ విషయం అతని కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచారు.


Next Story

Most Viewed