ఎమ్మెల్యే, మంత్రులవి అవకాశవాద రాజకీయాలు

by  |
ఎమ్మెల్యే, మంత్రులవి అవకాశవాద రాజకీయాలు
X

దిశ, వరంగల్: తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్‌ లు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. 2004లో చంద్రబాబు అధికారం కోల్పోయి టీఆర్‌ఎస్‌లో చేరిన వీరు అధికారం చేతికొచ్చాక బీజేపీని విమర్శించే స్థాయి ఎదిగారా అంటూ ఆమె మండిపడ్డారు. బుధవారం హన్మకొండలోని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై దాడి చేసిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టి మూడు గంటల్లో వదిలిపెట్టిన పోలీసులు, ఎమ్మెల్యే నరేందర్ ఇంటి పై దాడి చేసిన బీజేపీ కార్యకర్తల పై మాత్రం నాన్ బైయిలబుల్ కేసులు పెట్టి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచడం అధికార దుర్వినియోగం కదా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అరవింద్ పై కోడిగుడ్లతో దాడి చేసి ఏదో గొప్పపని చేశామని మంత్రి దయాకర్ రావు దిగజారుడు స్టేట్మెంట్లు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవాలు అయినందున, దానికి జవాబు చెప్పలేకనే భౌతిక దాడులకు దిగడం టీఆర్ఎస్ నేతల చిల్లర రాజకీయాలకు నిదర్శనమన్నారు. దయాకర్ రావు టీడీపీలో ఉన్నపుడు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై ఘోరమైన పదజాలంతో మాట్లాడి, రాయలసీమ రౌడీలను రక్షణగా పెట్టుకుని చంద్రబాబు నాయుడుని పాలకుర్తి తీసుకొని వచ్చింది వాస్తవం కదా అన్నారు.

జనగాం మండల కేంద్రంలో నిరసన తెలిపిన తెలంగాణ వాదులను కొట్టుకుంటూ తీసుకెళ్ళిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు.నాటి బహిరంగ సభలో చంద్రబాబు చేత తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారిని తిట్టించిన మీ చరిత్రను ఏ ఒక్క తెలంగాణ వాది కూడా మర్చిపోలేదన్నారు. ఇక్కడి ప్రజలందరూ మీ మానసిక స్థితి మంచిగా లేదని అనుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ధాస్యం వినయ్ భాస్కర్ మీరు నిప్పు అని చెప్తే నమ్మడానికి ప్రజలెవరూ కుడా సిద్ధంగా లేరు.. మీ అక్రమాల చిట్టా చదవాలంటే సంవత్సరం కూడా సరిపోదని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని తెలిపారు.


Next Story