తెలంగాణలో తాలిబన్ రాజకీయాలు : మురళిధర్ రావు

by  |
తెలంగాణలో తాలిబన్ రాజకీయాలు : మురళిధర్ రావు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తాలిబన్లను తలపించేలా రాజకీయాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్ రావు ఆరోపించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పట్లో తీసుకున్న చర్యల కారణంగా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. రజాకర్ల పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించి ఎంతోమంది త్యాగాలు చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారతదేశంలో ఈ ప్రాంతం విలీనమైన తేదీని తెలంగాణ విమోచన దినంగా జరపకుండా అమరుల త్యాగాలను హేళన చేస్తున్నారని మురళీధర్ రావు చెప్పారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు అవసరమైన పోరాటాలను సాగిస్తున్నారని చెప్పారు.

విభిన్న మతాలు కులాలు, భాషలు సంస్కృతులు ఉన్న 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏకతాటి పై తీసుకు వెళుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను గొప్పగా కీర్తిస్తూ తాలిబన్ల పాలనను గుర్తుకు తెస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉన్నంతవరకు తాలిబాన్లను తలపించే పాలన ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఫుల్ టైం రాజకీయ నాయకుడు కాదని, అతనో పార్ట్ టైం పొలిటిషన్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేది ఏమీ లేదని మురళీధర్ రావు అన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని, అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టేది బీజేపీ అని మురళీధర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర నాయకులు శాంతకుమార్, నాగూరావు నామాజీ, పద్మజా రెడ్డి, రతంగ్ పాండు రెడ్డి, ఎగ్గని నర్సింలు, రవీందర్ రెడ్డి, రామకృష్ణ, కౌన్సిలర్లు అంజయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed