ఈటల గెలుపుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by  |
Eatala Rajender Bjp
X

దిశ, కామారెడ్డి : హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో వందమంది సీఎంలు వచ్చినా ఈటల రాజేందర్ గెలుపు ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేకపోవడం వారి అసమర్థ నాయకత్వాన్ని తెలియజేస్తుందని విమర్శించారు.

గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం కట్టాలో ప్రజలకు తెలుసన్నారు. తమ పక్షాన నిలబడేది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరారు. గతంలో దుబ్బాకలో ఎంత నిష్టగా బీజేపీ పని చేసిందో అంతే నిష్ఠగా హుజురాబాద్ లో కూడా పని చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వందమంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరన్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడు పాలపొంగు, నీటి బుడగ లాగా ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్ళగానే గెలుపు కాదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

అన్ని పార్టీలు పైసలతో వెళ్తే తాను సైనికులతో వెళ్తానని చెప్తున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి ఆ పార్టీ నాయకుని ఆడియో టేపు వైరల్ గా మారిందని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మాటలు ఉత్తవేనని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికలలో బీజేపీ, టీఆర్ఎస్ కు మాత్రమే పోటీ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికలో బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Next Story