‘ముఖ్యమంత్రిని తొలగించండి’

by  |
‘ముఖ్యమంత్రిని తొలగించండి’
X

న్యూఢిల్లీ: త్రిపుర బీజేపీలో ముసలం మొదలైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రాష్ట్ర సీఎం బిప్లబ్ దేవ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. బిప్లబ్ కుమార్ దేవ్‌కు అనుభవం లేదని, నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్నారని, ప్రజల్లోనూ విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలంటే బిప్లబ్ కుమార్ దేవ్‌ను సీఎంగా తొలగించాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి విన్నవించుకోవడానికి కనీసం ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో క్యాంప్ వేశారు.

సుదీప్ రాయ్ బర్మన్ నేతృత్వంలో సుశాంత చౌదరి, అశిష్ సాహా, అశిష్ దాస్, దివా చంద్ర రాంఖల్, బర్బ్ మోహన్ త్రిపుర, పరిమల్ దేవ్ బర్మ, రాం ప్రసాద్ పాల్‌లు ఢిల్లీ చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా ఉన్నారని చౌదరి తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా ఉన్నదని, కేవలం ఏడు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో సర్కారు కూలిపోదని త్రిపుర బీజేపీ అధ్యక్షుడు మాణిక్ సాహా స్పష్టం చేశారు.

ఏడుగురు ఎమ్మెల్యేలను బీజేపీ సంస్థాగత జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ కలిశారని, సీఎంను తొలగించడానికి పార్టీ సానుకూలంగా లేదని వారికి వివరించినట్టు తెలిసింది. కాగా, రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పీఎం నరేంద్ర మోడీలను కలవాలనుకుంటున్నారు. తాము బీజేపీ భావజాలానికి కట్టుబడి ఉన్నారని, పీఎం నేతృత్వంలోనే ముందుకు సాగుతామనీ రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed