అలకబూనిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!

by  |
అలకబూనిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: భారతీయ జనతా పార్టీకి గ్రేటర్‌లో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారం నిర్వహించకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. నగరంలోని ఇతర నియోజకవర్గాల్లోని డివిజన్లలో ప్రచారం సంగతి పక్కన పెడితే తాను స్వయంగా ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గంలో కూడా ఆయన ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు లేవు.

కేవలం ఎంఐఎం నేతలపై వీడియోలు రికార్డు చేసి మీడియాకు విడుదల చేయడం తప్పితే ఎక్కడా కూడా ప్రత్యక్షంగా మీడియా ముందుకు కూడా రాలేదు. దీంతో ఆయనను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగిన సొంత నియోజకవర్గపు కార్పొరేటర్ అభ్యర్థులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ఎన్నికల గడువు సమీపిస్తుండగా మరోవైపు ప్రచారంలో వెనుకబడి పోవడంతో అభ్యర్థులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.

దూసుకుపోతున్న ఇతర పార్టీలు….

గోషామహల్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా అన్ని డివిజన్లలో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మైకులు , పాద‌యాత్ర‌ల‌తో ప్రచార హోరును కొనసాగిస్తున్నాయి. ఆయా పార్టీలు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించి డివిజన్లలో బీజేపీ కంటే ప్రచారంలో ముందు వరుసలో ఉన్నాయి. అయితే, బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంతో మొదలైన తాత్సర్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచార రథాలు సైతం సిద్ధం చేసి పాదయాత్రలు చేయడం, పోలింగ్ ఏజెంట్లను నియమించుకుకోవడం వంటివి ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. కానీ, బీజేపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ప్రచార రథాలు సిద్ధం చేసుకోలేదు. ఎన్నికల ప్రచారం ముగింపునకు కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడం, ఇప్పటి వరకు పార్టీ అభ్యర్థులు ప్రచారం కూడా పూర్తి స్థాయిలో మొదలు పెట్టకపోవడం అభ్యర్థులందరినీ కలవర పరుస్తోంది.

రాజాసింగ్ ఒంటెద్ధు పోకడ….

ఎమ్మెల్యే రాజాసింగ్ తాను రెండవ పర్యాయం ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ ఒంటెద్దు పోకడను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన, మన అనే తేడా లేకుండా ఎవరిని, ఎప్పడు దగ్గరికి తీస్తాడో, ఎవరిని దూరం పెడతాడో కూడా తెలియని విధంగా ఉందని నియోజకవర్గంలోని నాయకులు చర్చించుకుంటున్నారు. ఉత్తర భారతీయుల ఓట్లతో రెండు సార్లు విజయం సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో వారి సానుభూతి కూడా పొందలేకపోతున్నాడని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.

మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన అనుచరులకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇప్పించుకోలేని స్థితికి ఎమ్మెల్యే పరిస్థితి దిగజారిందని వాపోతున్నారు. ముఖ్యంగా పార్టీకి సేవ చేసి రాజాసింగ్ అనుచరుడుగా ముద్ర పడిన గన్‌ఫౌండ్రి డివిజన్‌కు చెందిన నాయకుడు శైలేందర్ యాదవ్‌కు రాజాసింగ్ టిక్కెట్ ఇప్పించలేకపోవడం పరిస్థితికి అద్ధం పడుతోంది.

ఈ విషయంలో పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీలకు దిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జాంబాగ్‌లో కూడా ముందుగా ప్రకటించిన అభ్యర్థిని మార్చడం కూడా వివాదాస్పదమౌతోంది. రాజాసింగ్‌‌కు ప్ర‌ధాన అనుచ‌రుడిగా చెప్పుకుంటున్న ఓ నాయకుని సతీమణికి మంగళ్‌హాట్ డివిజన్ అభ్యర్థిగా టిక్కెట్ ఇప్పంచగలిగారు. ఐతే, ఆమె విజయం కోసం కూడా రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేవలం వీడియోలు రికార్డు చేసి వాట్సాప్ గ్రూపులలో పెట్టడం గమనార్హం.

కోల్పోతున్న పట్టు….

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు ఉండేది. అది క్రమ క్రమంగా వీడుతోందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉండగా కేవలం ఒక్క బేగంబజార్ డివిజన్‌ను మాత్రమే గత మూడు పర్యాయాలుగా బీజేపీ గెలుచుకుంది. ఇక్క‌డ రాజాసింగ్ చ‌రిస్మా కంటే అభ్య‌ర్థికి ప్ర‌జ‌ల‌లో ఉన్న గుర్తింపుతోనే విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు.

అయితే, ఈ పర్యాయం బేగంబజార్‌లో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఇదే జరిగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో బీజేపీ పట్టుకోల్పేయే ప్రమాదం లేకపోలేదు. ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికలలో నగరంలోని ఇతర నియోజకవర్గాలలో పార్టీకి ఓటింగ్ శాతం పెరిగి కార్పొరేటర్ల సంఖ్య కూడా రెండంకెలకు చేరే అవకాశం ఉండగా గోషామహల్‌లో ఉన్న డివిజన్లను కోల్పోతుందా అని పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed