సీపీని సస్పెండ్ చేయాలి.. కేంద్ర బలగాలను రప్పించండి !

by  |
సీపీని సస్పెండ్ చేయాలి.. కేంద్ర బలగాలను రప్పించండి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని, పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకంలేదని, రాష్ట్ర పోలీసు అధికారుల పనితీరుపై తమకు విశ్వాసం లేదని, కేంద్ర పారా మిలిటరీ బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. సిద్దిపేటలో సోమవారం జరిగిన సంఘటన అనేక రకాల సందేహాలకు తావు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న నమ్మకం లేదని సీఈఓ శశాంక్ గోయల్‌కు లిఖితపూర్వకంగా సమర్పించిన విజ్ఞప్తిలో బీజేపీ పేర్కొంది. సిద్దిపేట సంఘటన నేపథ్యంలో పోలీసు కమిషనర్‌ను సస్పెండ్ చేయాలన్నది తమ పార్టీ డిమాండ్ అని పేర్కొన్నారు.

బుద్ధభవన్‌కు వెళ్ళి సీఈఓ శశాంక్ గోయల్‌తో భేటీ అయిన అనంతరం బీజేపీ ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సిద్దిపేట ఘటనపై దర్యాప్తు జరిపించాల్సిందిగా లిఖితపూర్వకంగానే విజ్ఞప్తి చేశామని తెలిపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు జరపాల్సిందిగా ఆయనకు వివరించామని, రాష్ట్ర పోలీసులున్నట్లయితే ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న విషయాన్ని ఆయనకు వివరించినట్లు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించాల్సిందిగా సీఈఓకు వివరించామన్నారు.

పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని, ప్రత్యర్థి పార్టీలను ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందికి గురిచేస్తోందని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరామన్నారు. టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తోందని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఖర్చుపై దృష్టి పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. సిద్దిపేట ఘటనపై నివేదిక తెప్పించుకుంటామని తమకు సీఈఓ హామీ ఇచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.



Next Story