మంత్రిగారూ.. ‘ఇది రోడ్డా.. స్విమ్మింగ్ పూలా.. ’

by  |
మంత్రిగారూ.. ‘ఇది రోడ్డా.. స్విమ్మింగ్ పూలా.. ’
X

దిశ, కామారెడ్డి : ‘రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారూ.. కామారెడ్డి పట్టణంలో గుంతలు పడి ప్రమాదకరంగా మారిన సిరిసిల్ల రోడ్డు కనపడటం లేదా’ అని కామారెడ్డి పట్టణ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. సోమవారం కామారెడ్డి పట్టంలోని ధ్వంసమైన సిరిసిల్ల రోడ్డులో గుంతల్లో కూర్చుని జలదీక్ష చేపట్టారు. రహదారిని దిగ్బంధించి సుమారు గంట పాటు గుంతల్లో కూర్చొని నిరసన తెలిపారు. ‘ఇది రోడ్డా.. స్విమ్మింగ్ పూలా.. ఫైన్లు కాదు రోడ్లు వేయండి.. చందమామపై ఉన్న గుంతలు కాదండి కామారెడ్డి రోడ్లు అవి.. జిల్లా కేంద్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఏంటి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నాలుగు జిల్లాలకు కూడలిగా ఉన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రహదారి అద్వాన్నంగా తయారైందన్నారు. ఇక్కడి నుంచి ప్రతి రోజు వేలాదిగా ప్రజలు తమ రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రోడ్డు మొత్తం గుంతలుగా మారి ప్రమాదకరంగా తయారవడంతో వ్యవసాయ పనులు నిమిత్తం విత్తనాలు, ఎరువులు తీసుకెళ్లే రైతులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ఈ రోడ్డు మరమ్మత్తు పనులకు ప్రభుత్వం నుంచి నాలుగు కోట్లు మంజూరైనా అధికారులు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల రోడ్డుపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. జిల్లా మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నాలుగు కోట్లు మంజూరైన పనులు చేపట్టకపోవడం వెనక కమిషన్ సరిపోకపోవడం లాంటి కారణాలు ఏవైనా ఉన్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే బాగుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. మూడు రోజుల్లోగా ఈ రోడ్డు పనులు ప్రారంభం చేయకపోతే నాల్గవ రోజు రహదారిపై బైఠాయించి ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.


Next Story

Most Viewed