తుగ్లక్ చర్యలు మానుకోండి : లక్ష్మణ్

by  |
తుగ్లక్ చర్యలు మానుకోండి : లక్ష్మణ్
X

దిశ, న్యూస్ బ్యూరో: నిజాం కాలంలో నిరంకుశ మనస్తత్వం గల విసునూరు దశకంఠుడు తెలంగాణలో ప్రసిద్ధమైన ఇల్లు నిర్మించుకున్నాడని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గుర్తుచేశారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తనను తాను అవతార పురుషుడుగా భావించేవాడని.. తాను నిద్ర లేవగానే తనకు ఓ రాజ్యం ఉందని గుర్తుకు వచ్చేదని.. ఆ ఇద్దరి అంశతో పుట్టిన కేసీఆర్ ఇప్పుడు సచివాలయం కూల్చివేత విషయంలో అలాగే ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు శుక్రవారం బీజేపీ నేత లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌‌కు రెండు పేజీల లేఖ రాశారు. అందులో ఘాటు విమర్శలు చేశారు.

మిమ్మల్ని చూస్తుంటే విసునూరు రామచంద్రారెడ్డి దొర గుర్తొస్తున్నాడని ఎద్దేవా చేశారు. 32 డిపార్టమెంటులను ప్రగతిభవన్ గడీలో నుంచి పాలిస్తున్న మీరు ఏనాడు ఆ సచివాలయంలో కాలు పెట్టలేదని.. అలాంటప్పుడు రూ. 500 కోట్లకు పైగా ఖర్చుచేసి నిర్మించే సచివాలయం అవసరమా అని ప్రశ్నించారు. జిమ్మిక్కులతో కోర్టును కూడా నమ్మించి తప్పుదోవ పట్టిస్తూ.. దానిని ఎవరూ అడ్డుకోకుండా సుప్రీంకోర్టులో కూడా కేవియెట్ పిటిషన్ వేయాలని నిర్ణయించారనీ తెలుస్తోందని చెప్పారు.

ప్రజలు కరోనా చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చోటులేక, ప్రైవేటుకు వెళ్లలేక విలవిలలాడుతుంటే ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాత సచివాలయం కూలగొట్టాలని స్కెచ్‌లు వేస్తారా… అంటూ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ముఖ్య అంతరంగికుడు ప్రశాంత్‌రెడ్డితో ఓ కమిటీ వేసి తూతూమంత్రంగా అన్ని రాష్ట్రాల సచివాలయాలు పరిశీలన చేస్తున్నామని చెప్పి, ఆఖరుకు 11 గుమ్మటాలు ఉండేలా డిజైన్ నిర్మాణం చేయడం ఎవర్ని సంతృప్తి పరిచేందుకు అని ప్రశ్నించారు.

శాతవాహనులు, కాకతీయులు వారసత్వం తెలంగాణ ఉందా.. లేక రజాకారు వారసుల తెలంగాణ సృష్టించబోతున్నారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాల్లో కోత, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఇప్పటి వరకు పీఆర్సీ అమలు జరగలేదు. ఇంత ఘోరమైన పరిస్థితిలు రాష్ట్రంలో ఉంటే ‘ఊరంతా ఓ చింత ఉంటే.. ఊసు కండ్లోనికి ఇంకో చింత’ ఉన్నట్టు మీరు తుగ్లక్‌లా సచివాలయం కూల్చేస్తున్నారని లక్ష్మణ్ సీఎం కేసీఆర్‌ను లేఖలో విమర్శించారు.

132 యేండ్ల చరిత్ర కలిగి బకింగ్‌హామ్ ప్యాలెస్‌ లాగా, యూరోపియన్ నిర్మాణ శైలితో ఉన్నపాత సచివాలయం కూల్చి చరిత్రలో మీ పేరు శిలాఫలకంపై చెక్కించుకోవాలన్న దురాశతో చేస్తున్న పనే ఇది అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పని చేసిన 16మంది ముఖ్యమంత్రులకు రాని దుర్మార్గపు ఆలోచన మీ మనస్సులో మెదిలిందన్నారు. మీ చర్యలు చరిత్రలో మహమ్మద్ బీన్ తుగ్లక్‌ను గుర్తుచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.


Next Story