దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష.. డీకే అరుణ ఆగ్రహం

by  |
BJP Leader DK Aruna
X

దిశ, గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గద్వాల పట్టణంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీకే అరుణ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏడేండ్లలో ప్రజా సంక్షేమం మరిచి, బంగారు కుటుంబాన్ని సాధించుకున్నదని అన్నారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేరోజు దగ్గర్లోనే ఉందని వెల్లడించారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తిచేయడం లేదని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ కలిసిపోయి కృష్ణానీటిని అమ్ముకున్నాడని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు రాష్ట్రంగా తయారు చేశారని అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు అప్సర్ పాషా, జిల్లా ఇంచార్జ్ వెంకట్ రెడ్డి, ఇతర బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed