తిరుపతి ఉపఎన్నిక బరిలో బీజేపీ.. జనసేన మద్దతు

by  |
Somu Veerraju meets Pawan Kalyan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు సైతం జరిగిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వీటితోపాటు తిరుపతి లోక్ సభకు సంబంధించి ఉపఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే బీజేపీ జనసేన పార్టీలు మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే శుక్రవారం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని పార్టీ జాతీయ నేత మురళీధరన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇకపోతే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ఇన్ చార్జ్ సునీల్ దియోదర్ లు సమావేశం అయ్యారు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దించాలా అనే అంశంపై చర్చించారు. చివరకు బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించాలని నిర్ణయించారు. దీంతో పార్టీ అధిష్టానం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించింది. అయితే అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇదిలాఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ భావించింది. జనసేనకు ఓటు బ్యాంక్ ఉందని గెలిచే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ దీమా వ్యక్తం చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానంతో మాట్లాడతామని చెప్పుకొచ్చారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశంలో బీజేపీ-జనసేన తరపున బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించారు.



Next Story