లాయర్ల హత్య కేసులో బిట్టు శ్రీనుకు రిమాండ్

by  |
Bittu Srinu
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వామన్ రావు దంపతులో హత్య కేసులో ఏ4 నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టులో మంగళవారం అర్థరాత్రి హాజరు పరిచారు. నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు ఊదరి లచ్చయ్య పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అలాగే బిట్టు శ్రీను చెప్పిన కన్ఫెషన్ రిపోర్టును ఆధారం చేసుకున్న పోలీసులు మంథని పంచాయితీ నుండి అతను ట్రాక్టర్ అద్దెకు పెట్టిన వివరాలను సేకరించారు.

కత్తులెట్లా…?

వామన్ రావు దంపతులను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తులను తయారు చేసిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే కత్తులు ఉపయోగించి హత్య చేసిన నిందితులను, కత్తుల తయారు చేయించిన బిట్టును ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్ ముందు నిలిచి ఉందని చెప్పక తప్పదు. ఏ1 నిందితుడు కుంట శ్రీను, ఏ2గా ఉన్న శివందుల చిరంజీవిలు ఇద్దరూ కూడా మర్డర్ చేసిన తరువాత సుందిళ్ల బ్యారేజ్ వద్దకు వెళ్లి అక్కడ డ్రెస్ లు మార్చుకుని కత్తులు బ్యాక్ వాటర్ లో పడేశామని చెప్పారు. అయితే ఆ కత్తులు వెలికి తీయడం ఎలా అన్నది పోలీసుల ముందు ఉన్న సవాల్ అనే చెప్పాలి.

రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంట కోసం కాళేశ్వరంలో జలాలను నిలువ ఉంచాలని నిర్ణయించింది. కొంతమేర నీటిని ఇప్పటికే ఎగువ ప్రాంతాలకు తరలించింది. అయితే సుందిళ్ల బ్యారేజ్ లో పడేసిన కత్తులను వెలికి తీయాలంటే బ్యారేజ్ లో మొత్తం నీటిని ఖాలీ చేయాల్సి ఉంటుంది. లేనట్టయితే అవి బయటకు తేలే అవకాశం లేదు. కత్తులను బయటకు తీసేందుకు పోలీసులు ఎలా ముందుకు సాగుతురన్నదే అంతు చిక్కకుండా తయారైంది. ఒక వేళ నీటిని దిగువకు వదిలితే ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతానికి తరలిద్దామన్నా మానేరు ప్రాజెక్టుల్లో నీరు సమృద్దిగా ఉంది. వేల క్యూసెక్కుల నీటిని ఆయా ప్రాజెక్టుల ద్వారా దిగువ ప్రాంతాల్లోకి వదులుతున్నప్పటికీ సుందిళ్ల బ్యారేజీలో నిలువ ఉన్న నీరు టీఎంసీల్లో ఉంది. ఈ లెక్కన బ్యారేజ్ లోని నీటిని మొత్తం తరలించాలంటే నెలలకొద్ది సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. గజ ఈతగాళ్లతో కత్తులను వెలికి తీసేందుకు సాహసించినా బ్యాక్ వ్యాటర్ లో ఉన్న నాచు, జల జీవ రాశుల కారణంగా కత్తుల కోసం గాలించడానికి ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయి.

సీసీ కెమెరాల్లో రికార్డయిందా.?

వామన్ రావు, నాగమణిల హత్య తరువాత నిందితులు సుందిళ్ల బ్యారేజ్ వరకు వెల్లిన రహదారిలో ఎక్కడైనా సీసీ కెమెరాల్లో వీరి కదలికలు రికార్డయ్యాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. అలాగే నిందితులు బ్యారేజ్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడ కూడా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిందా లేదా అన్న విషయంపై కూడా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. సుందిళ్ల బ్యారేజ్ వద్దకు వీరు వెల్లినప్పుడు వీరిని ఎవరూ గమనించలేదా. సాధారణంగా ప్రతి బ్యారేజ్ వద్ద కూడా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారు. కుంట శ్రీను, శివందుల చిరంజీవీలు అక్కడకెళ్లినప్పుడు ఇరిగేషన్ యంత్రాంగం కంట పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీరిద్దరు ఎవరి కంట పడకుండా సుందిళ్ల చేరుకుని కత్తులు నీటిలో పడేసి, డ్రెస్సులు మార్చుకుని మహారాష్ట్ర వరకు ఎలా వెల్లారన్నది కూడా మిస్టరీగా మారింది.

Next Story

Most Viewed