వొడాఫోన్ ఐడియాలో తన వాటా ఇచ్చేందుకు సిద్ధమన్న కుమార్ మంగళం బిర్లా

by  |
వొడాఫోన్ ఐడియాలో తన వాటా ఇచ్చేందుకు సిద్ధమన్న కుమార్ మంగళం బిర్లా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం రంగంలో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియాలో తనకున్న వాటాను ప్రభుత్వ యాజమాన్య సంస్థకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. వొడాఫోన్ ఐడియాలో ఆయనకు 27 శాతం వాటా ఉంది. అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాను దివాలా పరిస్థితుల నుంచి గట్టెక్కించి కొనసాగించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి జూన్ నెలలోనే ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లలో వొడాఫోన్ ఐడియా అప్పులు దాదాపు 4 రెట్లు పెరిగి, ఈ ఏడాది మార్చి నాటికి రూ. 1.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2015-16లో సంస్థ అప్పులు రూ. 37 వేల కోట్లు మాత్రమే. ఇందులో వాయిదా వేసిన స్పెక్ట్రమ్ చెల్లింపులు, ఏజీఆర్ బకాయిలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలు రూ. 58,254 కోట్లు కాగా, ఇందులో రూ. 7,854 కోట్లను చెల్లించింది. ఇంకా రూ. 50,399 కోట్లను చెల్లించాల్సి ఉంది. వొడాఫోన్ ఐడియాకు ఉన్న 27 కోట్ల మంది వినియోగదారుల కోసం సంస్థ కొనసాగడానికి తన వాటాను ఎవరికైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన వివరించారు. ప్రభుత్వ మద్దతు లేకపోతే వొడాఫోన్ ఐడియా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. పూర్తిగా పతనమై దివాలాకు దారితీయవచ్చని కేబినెట్ సెక్ర‌ట‌రీ రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed