ఆ రాష్ట్రంలో నిషేధం ఉంది..కానీ తెగ తాగేస్తున్నారు

by  |
ఆ రాష్ట్రంలో నిషేధం ఉంది..కానీ తెగ తాగేస్తున్నారు
X

న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక మందుబాబులు ఉన్న రాష్ట్రం బీహార్. అదేమిటి ఆ రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉంది కదా అంటారా! కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్) 2019-20 ప్రకారం దేశంలో బీహార్ ప్రజలు తెగ తాగేస్తున్నారని తేలింది. ఈ జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్రను సైతం వెనక్కి నెట్టి మరీ బిహార్ మందుబాబులు ముందుకు సాగుతున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే ప్రకారం.. బీహార్ రాష్ట్ర పురుషుల జనాభాలో 15సంవత్సరాలు ఆ పైబడిన వారిలో 15.5 శాతం మంది మద్యం తాగుతారని తేలింది.

ఆ రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల(14శాతం) కంటే గ్రామీణులే (15.8) ఎక్కువగా మందు కొడతారని వెల్లడైంది. జేడీయూ సర్కార్ బీహార్ రాష్ట్రంలో 2016, ఏప్రిల్ నుంచి సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేస్తుండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (13.9శాతం) ఉన్నది. ఇక్కడ కూడా పట్టణ ప్రాంత ప్రజల(13శాతం) కంటే గ్రామీణ ప్రాంత ప్రజలే(14.7శాతం) ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. దేశంలో అతి తక్కువగా మద్యం తాగే రాష్ట్రాల్లో గుజరాత్ (5.8శాతం), ఆ తర్వాత (8.85శాతం) కేరళ రాష్ట్రాలు ఉన్నాయి.

అన్ని రాష్ట్రాల్లో కూడా మద్యంతో పోలిస్తే పొగాకు తీసుకునే వారి సంఖ్యే అధికంగా ఉన్నట్లు తేలింది. అత్యధికంగా మిజోరం రాష్ట్రంలో 75శాతం మంది ప్రజలు పొగాకు తీసుకుంటారని స్పష్టమైంది. అతి తక్కువ పొగాకు తీసుకునే రాష్ట్రాల్లో కేరళ (17శాతం), గోవా (18శాతం) ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా, పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేశాడు. మద్యం, పొగాకు వినియోగంపై 15ఏండ్లు ఆ పైబడిన వారిని పరిగణలోకి తీసుకుని సర్వే చేశారు.


Next Story

Most Viewed