టీఆర్ఎస్‌కు షాకిస్తున్న నేతలు.. ఎన్నికలపై ఎఫెక్ట్ తప్పదా.?

by  |
trs leader
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోకల్ బాడీస్ డెలిగేట్స్‌ను క్యాంపులకు తరలించాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే చాలా మంది క్యాంపులకు రామని తేల్చి చెప్తున్నట్టుగా సమాచారం. వారిని బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్న సానుకూల స్పందన రావడం లేదని తెలుస్తోంది.

అధిష్టానం నిర్ణయం వెనుక..

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ అనివార్యమని స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఏకగ్రీవాలతో మండలిలోకి అడుగు పెట్టడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ప్రతినిధుల నుండి వ్యతిరేకత మొదలైంది. కారణాలు ఏమైనప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీకి సరికొత్త తలనొప్పిగా మారిపోయిందనే చెప్పాలి. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల పరంపర కొనసాగుతుండటంతో అధికార పార్టీ వ్యూహం మార్చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న అధిష్టానం అనూహ్యంగా క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ జరిగే నాటి వరకూ క్యాంపును కొనసాగించినట్టయితే తమ పార్టీ ప్రతినిధులు వేరే వారికి అనుకూలంగా మారే అవకాశాలు ఉండవని భావించింది. అయితే ఇప్పుడు చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు క్యాంపులకు రామని స్పష్టం చేస్తుండటంతో కొత్త తలనొప్పి తయారైందనే చెప్పాలి.

వారు చెప్తున్న కారణాలు..

మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాలా మంది కూడా వ్యవసాయ నేపథ్యం ఉన్న వారే. అయితే ఈసారి ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తాము రాలేకపోతున్నామని చెప్తున్నారు. తాము పండించిన పంట ఇంకా అమ్ముకోలేదని దీనివల్ల తాము రాలేకపోతున్నామని తేల్చి చెప్తున్నారట. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని అన్ని చోట్ల కూడా ఎదురవుతుండడం గమనార్హం. 15 రోజుల పాటు క్యాంపులో ఉండడం వల్ల ధాన్యం అమ్మడం కష్టంగా ఉంటుందని చెప్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

లోగుట్టు ఏంటో..?

అయితే వరిధాన్యం అమ్మే విషయం గురించి చెప్తున్నప్పటికీ బలమైన కారణం ఇదేనా లేక మరేదైనా ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. స్థానిక ప్రజా ప్రతినిధులు చెప్తున్న విషయం నిజమా లేక సాకుగా చూపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. రాక రాక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని అన్నింటా లాభపడాలన్న యోచనలో ఉన్న కారణంగానే ధాన్యం అమ్మకాలంటూ వంక చెప్తున్నారేమోనన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి.

Next Story

Most Viewed