జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బిగ్ షాక్.. 60 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాజీనామా..

by  |
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బిగ్ షాక్.. 60 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు రాజీనామా..
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన 60 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి షాక్ ఇచ్చారు. సోమవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్‌కు తమ సంతకాలతో కూడిన రాజీనామా పత్రం అందిస్తున్నట్లు, అంబేద్కర్ కూడలి వద్ద రాజీనామా పత్రం బహిర్గతం చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికకు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, గ్రామ కమిటీ పోటీలో ఉన్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నూతన గ్రామ కమిటీని ఏకపక్షంగా ఎన్నుకోవడంతో రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు.

ఉద్యమ సమయంలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, మండలంలో సీనియర్ నాయకులుగా చలామణి అవుతున్న కొందరు నాయకులు పార్టీ కార్యకలాపాల్లో ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారన్నారు. వారికి అనుకూలంగా ఉన్న వారికి సమాచారం ఇస్తూ మిగతా కార్యకర్తలకు, నాయకులకు సమాచారం ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారన్నారు. మండలంలో బీసీ వర్గానికి ఇప్పటివరకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఉద్యమ సమయంలో నుండి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న సీనియర్లను వదిలేసి, పార్టీలో కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు అనేక పోరాటాలు చేసి రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడిన తమకు నేడు పార్టీలో ప్రాధాన్యత లేక అవమాన భారంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు.


Next Story

Most Viewed