70 లక్షల భీమ్ యూజర్ల డేటా లీక్

by  |
70 లక్షల భీమ్ యూజర్ల డేటా లీక్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భీమ్‌ యాప్‌ యూజర్ల డేటా లీకయింది. ఫిబ్రవరి 2019 నెలకు చెందిన యూజర్ల డేటా లీక్‌ అయినట్లు సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. ఈ మేరకు వీపీఎన్‌ మెంటార్‌ అనబడే వీపీఎన్‌ రివ్యూ వెబ్‌సైట్‌ టీమ్ డేటా లీక్ అయినట్లు నిర్ధారించింది. యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌లో లోపాలున్నాయంటూ కొందరు ఎథికల్‌ హ్యాకర్లు సోమవారం ఓ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్చరించారు. భీమ్‌ మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ ద్వారా భారీ స్థాయిలో వినియోగదారుల ఆర్థిక సమాచారం పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చిందన్నారు. భీమ్‌ యాప్‌ యూజర్లకు చెందిన ప్రొఫైల్స్, లావాదేవీలు, బర్త్ సర్టిఫికెట్, ఆధార్, పాన్, కాస్ట్‌ సర్టిఫికెట్, రెసిడెన్స్‌ ప్రూఫ్, బ్యాంక్‌ అకౌంట్ల వివరాలు ఇతర ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్ల వంటి 409 జీబీల సమాచారం ప్రమాదంబారిన పడినట్లు చెప్పారు. అయితే ఈ ఆరోపణలను ‘ఎన్పీసీఐ’ కొట్టేసింది. భీమ్‌ యాప్‌ సురక్షితమేనని, భీమ్‌ యాప్‌లో ఉన్న లోపాన్ని సరిచేశారన్నారు. డేటా లీక్ కాలేదని ఎన్పీసీఐ తెలిపింది.

ఈ యాప్‌లో ఉన్న ఓ లోపం ద్వారా కీలక సమాచారం లీకవుతోందని హ్యాకర్లు వీపీఎన్‌ మెంటర్‌ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలోనే ‘ఎన్పీసీఐ’ కొన్ని ప్రాథమిక భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఈ ముప్పు తప్పి ఉండేదని వీపీఎన్ నిపుణులు అన్నారు. చిన్న లోపం వల్ల దాదాపు 70 లక్షల భీయ్ యూజర్ల డేటా లీక్ అయినట్లు తెలిపారు. ఇక 2016లో నోట్ల రద్దు అనంతరం డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించేందుకు భీమ్‌ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఆ యాప్‌ వాడకం ఎక్కువైంది. ఈ యాప్ వచ్చిన కొత్తలో కూడా యూజర్స్ నుంచి పలు విమర్శలు ఎదుర్కొంది. దాంతో ఆన్‌లైన్ పేమెంట్స్‌ను సురక్షితం, సులభతరం చేసేందుకు భీమ్ యాప్ 2. 0 వెర్షన్‌ను 2018లో అందుబాటులోకి తీసుకొచ్చారు.



Next Story

Most Viewed