ఎయిర్‌టెల్ నష్టాలు రూ. 763 కోట్లు

by  |
ఎయిర్‌టెల్ నష్టాలు రూ. 763 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ. 763.2 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 23,405 కోట్ల నష్టాలతో పోలిస్తే ఈసారి ఎంతో మెరుగు. అయితే, సమీక్షించిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్ అంతర్జాతీయ ఆదాయం ఏకంగా 22.02 శాతం పెరిగి రూ. 25,785 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 21,131 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అన్ని విభగాల్లో బలమైన వృద్ధి నేపథ్యంలో కంపెనీ ఆదాయం మెరుగ్గా ఉందని కంపెనీ పేర్కొంది.

కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో అధిక సుంకాలు, డేటా వినియోగం పెరుగుదల కూడా కంపెనీ ఆదాయానికి మద్దతు లభించిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్ ఇండియా వ్యాపారం సైతం ఆదాయ, మార్జిన్లలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఎయిర్‌టెల్ ఇండియా ఆదాయం 22 శాతం పెరిగి రూ. 18,747 కోట్లకు చేరుకోగా, ఎబిటా మార్జిన్ 4.7 శాతం పెరిగి రూ. 45.8 శాతానికి చేరుకుంది. అదేవిధంగా వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) గతేడాది రూ. 128 నుంచి ఈసారి రూ. 162 కు మెరుగైనట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం 32.6 శాతం పెరిగి రూ. 11,848 కోట్లుగా ఉంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇది బలహీనమైన త్రైమాసికం అయినప్పటికీ ఆదాయం 22 శాతం పెరుగుదలతో బలమైన పనితీరును అందించాం. అలాగే, 4జీ కస్టమర్లు 1.4 కోట్లకు చేరుకోగా, ఆదాయాలు 26 శాతం పెరిగాయి. భారత టెలికాం రంగంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచేందుకు ఈ ఫలితాలు నిదర్శనం. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ డేటా వినియోగం 58 శాతం పెరిగింది. తమ నెట్‌వర్క్‌తో వినియోగదారుల అనుబంధం ఎంత ధృఢంగా ఉందో ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి’ అని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 0.24 శాతం తగ్గి రూ. 433 వద్ద ముగిశాయి.

Next Story

Most Viewed