సర్కారుకు రూ. 150కే టీకా దీర్ఘకాలం కష్టమే

by  |
సర్కారుకు రూ. 150కే టీకా దీర్ఘకాలం కష్టమే
X

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి రూ. 150కే టీకాల సరఫరా దీర్ఘకాలంలో కష్టమేనని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ పేర్కొంది. అలాగే, ప్రైవేటు హాస్పిటళ్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నదన్న వాదనలకు సమాధానమిచ్చింది. ప్రభుత్వానికి తక్కువ ధరకు సరఫరా చేయడం మూలంగా కలిగే కొద్దిపాటి నష్టాలను పూడ్చుకోవడానికి ప్రైవేటు మార్కెట్‌కు ఎక్కువ ధరకు విక్రయించక తప్పదని సమర్థించుకుంది. టీకా ధరలపై జరిగిన చర్చకు వివరణగా కొవాగ్జిన్ ధరను ప్రభావితం చేసే పలు అంశాలను ఏకరువుపెట్టింది. టీకా అభివృద్ధి సంస్థ సొంతంగా రూ. 500 కోట్లను వెచ్చించిందని, దాని అభివృద్ధిలో జరిగే నష్టాలు, టీకాకు కావాల్సిన ముడి సరుకు ఇతర అంశాలను ప్రస్తావించింది. అలాగే, తక్కువ మొత్తంలో టీకాలకు ఆర్డర్‌లు, అధిక డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, రిటైల్ మార్జిన్లూ ధరలను ప్రభావితం చేస్తాయని వివరించింది. దేశీయ టీకాలకు తక్కువ ధర నిర్ణయిస్తే మరిన్ని ఆవిష్కరణలకు, ఉత్పత్తులకు ఆటంకంగా మారుతుందనీ పేర్కొంది.

కాబట్టి, ద్వంద్వ ధరల విధానం మనుగడకు తప్పనిసరి అని వివరించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ. 150కి, రాష్ట్రాలకు, ప్రైవేటు హాస్పిటళ్లకు అంతకంటే ఎక్కువ ధరకు టీకాలను కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవేటు హాస్పిటళ్లకు కేవలం పదిశాతం టీకాలను, మిగతావి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేసినట్టు భారత్ బయోటెక్ వివరించింది. దీని ప్రకారం, వెయిటేజీ తీస్తే ఒక్కో డోసును రూ. 250కు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నట్టు తేలిందని పేర్కొంది. భవిష్యత్‌లో 75శాతం టీకాలను ప్రభుత్వాలకు, 25శాతం టీకాలను ప్రైవేటు హాస్పిటళ్లకు సరఫరా కొనసాగిస్తామని వివరించింది. కానీ, ఇకపై 25శాతం కేవలం ప్రైవేటు హాస్పిటళ్లకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా టీకా వేయడానికి నిర్ణయించుకున్నా, ప్రైవేటు హాస్పిటళ్లలో పంపిణీ చేయడమనేది తమకు ఒక అదనపు అవకాశం మాత్రమేనని వివరించింది. ఇది సరైన పోటీ విధానం కాదనీ, ప్రభుత్వానికి రూ. 150కే డోసును దీర్ఘకాలం సరఫరా చేయడం దీర్ఘకాలంలో కష్టమేనని తెలిపింది.



Next Story

Most Viewed