బెంగాల్‌లో ఉద్రిక్తతల నడుమ భారీ పోలింగ్

by  |
బెంగాల్‌లో ఉద్రిక్తతల నడుమ భారీ పోలింగ్
X

కోల్‌కతా : అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల నడుమ ముగిసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో తొలి దశ మాదిరిగానే రెండో దశలోనూ భారీ పోలింగ్ నమోదైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లో 80.43 శాతం, అసోంలో 76.96 శాతం పోలింగ్ నమోదైంది. ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన నందిగ్రామ్‌లో కూడా 80 శాతానికిపైగా పోలింగ్ రికార్డైనట్టు ఈసీ తెలిపింది. ఇక బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పలు చోట్ల ఘర్షణలకు దిగారు. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి పోలింగ్ బూత్‌ల వద్దే ఉంటూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. తొలిదశలో భాగంగా బెంగాల్‌లో 84.63 శాతం, అసోంలో 79.97 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.

దీదీ హంగామా..

ఓటింగ్ సందర్భంగా మమతా బెనర్జీ నందిగ్రామ్‌లోని బోయల్‌లో ఉన్న పోలింగ్ బూత్ నెం. 7 ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి కేంద్ర బలగాలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో కేంద్ర బలగాలు, పోలింగ్ అధికారులు.. స్థానికులను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇదే విషయమై ఆమె పోలింగ్ బూత్ నుంచే గవర్నర్ జగ్దీప్ ధన్కర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. అయితే ఇదే విషయమై ఈసీ స్పందిస్తూ.. మమతా ఆరోపిస్తున్నట్టు 7 వ నెంబర్ పోలింగ్ బూత్‌లో అలాంటివేం జరగలేదని వివరణ ఇచ్చింది.

సువేందు కాన్వాయ్‌పై దాడి

కాగా నందిగ్రామ్ లోని సతేన్‌గబరి అనే ఊరిలో సువేందు కాన్వాయ్‌పై ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆయన సురక్షితంగానే బయటపడినా.. సువేందు వెనుక వస్తున్న జర్నలిస్టుల కారు ధ్వంసమైంది. సువేందుతో పాటు ప‌శ్చిమ మిడ్నాపూర్‌లో మ‌రో బీజేపీ అభ్యర్థి ప్రీతిశ్ రంజ‌న్ కౌర్ కాన్వాయ్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. పశ్చిమ మిడ్నాపూర్ లోని డెబ్రాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.

Next Story

Most Viewed