ఈ-స్మార్ట్ షాపింగ్‌‌లో లాభాలు.. మోసాలు

by  |
ఈ-స్మార్ట్ షాపింగ్‌‌లో లాభాలు.. మోసాలు
X

దిశ, శేరిలింగంపల్లి: ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయింది. అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. ఏమి లేకున్నా చేతిలో సెల్ ఉంటే చాలు.. సెల్ మోహనరంగా అంటూ ఏ షాపులో వస్తువునైనా కాలు కదకుండా ఇట్టే కొనేయొచ్చు. కోరిన వస్తువును తెప్పించుకోవచ్చు. అడుగు బయట పెట్టకుండా నచ్చింది తినొచ్చు. మెచ్చిన వంటలు, నచ్చిన బట్టలు, జ్వరమొస్తే మందులు ఇంటికి కావాల్సిన వస్తువులు ఇలా అన్ని ఈ-షాపింగ్ లో లభిస్తాయి. కావాల్సిందల్లా చేతిలో స్మార్ట్ ఫోన్, బ్యాంక్ లో బ్యాలెన్స్ మాత్రమే.. అంతే కాందడోయ్.. ఈ షాపింగ్ తో మోసపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయ్ తస్మాత్ జాగ్రత్త..

ఫుల్ డిమాండ్…

ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ వస్తువుల కొనుగోళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. గతంలోకంటే కరోనా మహమ్మారి విజృంభనతో ఈ తరహా వ్యాపారం ఇప్పుడు మూడు ఆర్డర్లు, ఆరు పర్చేజ్ లు అన్నట్లుగా జోరుగా సాగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేదు. ఉన్నవాళ్లు, లేని వాళ్లు అనే తారతమ్యం లేదు. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఈ తరహా కొనుగోళ్లు చేయడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. పట్నం నుంచి మొదలు పల్లెల వరకు ఆన్ లైన్ ఆర్డర్లు కామన్ గా మారిపోయాయి. తమకు కావాల్సిన వస్తువును ఫోన్ లో వెతుక్కోవడం.. నచ్చితే ఆర్డర్ ఇవ్వడం పరిపాటిగా మారింది. డెలివరీ చేసేందుకు పలు సంస్థలు కూడా పోటీపడుతుండడంతో వినియోగదారుడికి ప్రతీ వస్తువు అందుబాటులోకి వచ్చింది. అంతేకాక కస్టమర్ మెప్పు పొందేందుకు కోరిన వస్తువులో ది బెస్ట్ ఏదో సెలెక్ట్ చేసి మరీ అందిస్తున్నాయి ఆన్ లైన్ సంస్థలు. ఇలా డబ్బుకు డబ్బు, పేరుకు పేరు గడిస్తున్నాయి. దీంతో ఆన్ లైన్ డెలివరీ వ్యాపారంలో తీవ్ర పోటీ ఏర్పడింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి మొదలు గల్లీ కొట్టు వ్యాపారి వరకు ఈ తరహా బిజినెస్ చేస్తున్నారు. ఫుడ్ చైన్ తో మొదలైన ఆన్ లైన్ వ్యాపారం ఇప్పుడు అన్ని వస్తువులకు పాకింది. ఏది కావాలంటే అది ఒక్క క్లిక్ తోనే దొరుకుతుంది. దీంతో క్షణం తీరికలేని జనాలు నగరాల్లో ఈ తరహా డెలవరీలకే అలవాటు పడిపోయారు. అదే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరింది.

డిజిటల్ పేమెంట్స్…

ఆన్ లైన్ వస్తువుల లావాదేవీలు అన్నీ స్మార్ట్ ఫోన్ నుంచే నడుస్తుంటాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువయ్యాయి. అలాగే ఇప్పుడు పర్సులో డబ్బుకంటే కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫోన్ ల ద్వారా డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈతరహా లావాదేవీలను ప్రోత్సహించడంతో చాలా వరకు స్మార్ట్ పేమెంట్లే చేస్తూ బిల్లులు చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ మాత్రమే కాదు. అన్ని రకాల బిల్లులను డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లిస్తున్నారు. ఇలా చెల్లిస్తే గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ వంటి సంస్థలు ఓచర్స్ కూడా ఇస్తుండడంతో జనాలు అటువైపు మొగ్గు చూపుతున్నారు.

బిజినెస్ లో న్యూ ట్రెండ్..

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు ఆన్ లైన్ అమ్మకాలపై కోట్ల రూపాయల లెట్టుబడులు పెడుతున్నాయి. పండగల సందర్భాల్లో స్పెషల్ ఆఫర్లు ప్రకటించి జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అనే ఓల్డ్ బిజినెస్ పద్ధతికి విరుద్ధంగా న్యూ ట్రెండ్ ఫాలో అవుతూ దూసుకుపోతున్నాయి. ఇదే తరహా వ్యాపారాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. నగరంలో ఈ తరహా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఇంట్లోకి కావాల్సిన ప్రతీ వస్తువును దాదాపుగా ఆన్ లైన్ లో కొనేవారు ఎక్కువయ్యారు. డెలివరీ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుండడంతో వినియోగదారుల హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఫుడ్ డెలివరీ..

ఆన్ లైన్ వస్తువుల కొనుగోళ్ల తర్వాత ఫుడ్ డెలివరీకి బాగా డిమాండ్ ఉంది. భోజన ప్రియులు ఎక్కడ మంచి బిర్యానీ దొరుకుతుంది. కబాబ్స్ ఎక్కడ బాగుంటాయి. స్పెషల్ ఐటమ్స్ కు ఏది ఫేమస్ అని ఆన్ లైన్ లో సెర్చ్ చేసి మరీ ఆర్డర్లు ఇస్తున్నారని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. కష్టమర్స్ కోరితే చాలు ప్యారడైజ్ బిర్యానీ అయినా ఓల్డ్ సిటీ షావర్మా అయినాసరే తెచ్చి పెట్టేందుకు రెఢీగా ఉంటున్నారు డెలివరీ బాయ్స్. ఉదయం టిఫిన్ నుంచి మొదలు రాత్రి డిన్నర్ వరకు ప్రతీ ఫుడ్ ఐటమ్ అందుబాటులో ఉండడంతో భోజన ప్రియులు తమకు నచ్చిన హోటల్ నుంచి కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకుని పుష్టిగా లాంగిచేస్తున్నారు. స్విగ్గీ, జోమాటో, ఫుడ్ పాండా వంటి సంస్థలు ఈ బిజినెస్ లో దూసుకుపోతున్నాయి.

మోసాలూ ఎక్కువే..

ఆన్ లైన్ వ్యాపారం ఎంత జోరుగా సాగుతున్నా అంతే మొత్తంలో మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. డిజిటల్ పేమెంట్స్ ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును కాజేస్తున్నారు. ఆన్ లైన్ షాపింగ్, డిజిటల్ లావాదేవీల్లో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ తరహా మోసాలు ఈ మధ్య కాలంలో సర్వసాధారణంగా మారిపోయాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నిలువునా దోచేస్తుంటారు తస్మాత్ జాగ్రత్త.



Next Story

Most Viewed