ఆ బెగ్గర్స్.. ఇప్పుడు లక్షాధికారులు!

by  |
ఆ బెగ్గర్స్.. ఇప్పుడు లక్షాధికారులు!
X

దిశ, వెబ్‌డెస్క్: అదృష్టం ఉంటే.. మట్టిని ముట్టినా బంగారమవుతుందన్న మాటల్లో నిజం లేకపోయినా, అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఈ మాటలు అక్షర సత్యాలే అని నిరూపిస్తుంటాయి. తాజాగా ఫ్రాన్స్‌, బ్రెస్ట్ నగరంలో.. ఓ యువతి నలుగురు బిచ్చగాళ్లకు దానం చేసిన లాటరీ టికెట్‌‌కు లక్ష్మీదేవి వరించడంతో లక్షాధికారులయ్యారు.

బ్రెస్ట్ నగరంలో లాటరీ టికెట్లు అమ్మే షాపు ముందర నలుగురు బిచ్చగాళ్లు భిక్షమెత్తుకుంటూ ఉండేవారు. ఒకరోజున ఓ యువతి వన్ యూరో (రూ. 86) పెట్టి ఆ షాపులో లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. అదే టైమ్‌లో షాప్ ముందే ఉన్న బిచ్చగాళ్లు.. ఆ యువతిని భిక్షం అడిగారు. సదరు యువతి దగ్గర చిల్లర డబ్బులు లేకనో లేదా తన మనసులో ఏమనిపించిందో కానీ, ఆమె కొన్న లాటరీ టికెట్‌ను వారిలో బొచ్చెలో వేసింది. అయితే వాళ్లు దాన్ని భద్రంగా దాచుకోవడం విశేషం. ఇంతలోనే తమ లాటరీకి 50 వేల యూరోల (రూ. 43 లక్షలు) జాక్‌పాట్ తగలడంతో ఆ బిచ్చగాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. వాళ్లు లాటరీ గెలుచుకున్న విషయం నిజమేనని ఫ్రెంచ్‌ లాటరీ ఆపరేటర్‌ ఎఫ్‌డీజే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ నలుగురు బిచ్చగాళ్లు ఆ డబ్బును సమానంగా పంచుకుని, ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

లాటరీ టికెట్ కొనుగోలు చేసిన యువతి.. ఏకంగా టికెట్‌నే దానం చేయడం, అది కూడా బెగ్గర్స్‌కు దానం చేయడం.. సరిగ్గా ఆ లాటరీ నెంబర్‌కే జాక్‌పాట్ తగలడం నిజంగా ఇలాంటి కథలు సినిమాల్లో తప్ప నిజజీవితాల్లో జరగడం చాలా అరుదు. అందుకే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.



Next Story

Most Viewed