బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి : మోడీ

by  |
బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వాలి : మోడీ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ధీటుగా పోరాడుతున్నారని వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ప్రస్తుతం కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్‌పై ఫోకస్ పెట్టాలన్నారు. అది రాకుండా జాగ్రత్తలు పాటించడం, వాటిని ఎదుర్కోవడానికి సంసిద్ధమవ్వాలని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులను అక్కడి వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో ప్రధాని ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు.

పల్లెలకు కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నొక్కిచెప్పారు. కరోనాపై పోరు సుదీర్ఘమైనదని కాబట్టి, ఎక్కడ అనారోగ్యముంటే.. అక్కడికి వెళ్లి సేవ చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. సెకండ్ వేవ్ వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెంచిందని అన్నారు. ఒకవైపు ఆక్సిజన్ బెడ్‌ల డిమాండ్, మరోవైపు పేషెంట్ల రికవరీ సమయం పెరగడం లాంటి అంశాలతో పెనుసవాళ్లను ఎదురు నిలిపాయని చెప్పారు.

మొత్తం బెనారస్ సహా బిహార్‌లోని పలు ప్రాంతాలు చికిత్స కోసం కాశీకే వస్తుంటారని, దీంతో ఈ ఒత్తిడి మరింత అధికమవుతుందని, అయినప్పటికీ అధికారులు స్వల్ప సమయంలోనే వసతులను సమకూర్చుకోగలిగారని తెలిపారు. కాశీలో మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్, డోర్-టు-డోర్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్‌లు సక్రమంగా అమలు చేశారని వివరించారు. కేసులు తగ్గిపోయినా ఈ జాగ్రత్తలు కొనసాగించాలని అన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిస్టర్ల సేవలను కొనియాడారు. కరోనాపై పోరుకు యోగా ప్రపంచవ్యాప్తంగా ఉపకరించిందని తెలిపారు.

ప్రధాని కంటతడి..

కరోనాతో మరణించినవారికి నివాళి అర్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ‘కరోనా మహమ్మారి ఎంతోమంది ఆత్మీయులను కబళించింది. ఎన్నో కుటుంబాలకు ఆప్తులను దూరం చేసింది. వారందరికీ నా నివాళి. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’ అని అన్నారు.

Next Story

Most Viewed