కరోనా సెకండ్ వేవ్‌తో జాగ్రత్తగా ఉండండి..

by  |
కరోనా సెకండ్ వేవ్‌తో జాగ్రత్తగా ఉండండి..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వ్యాధి సెంకడ్ వేవ్ విజృంభిస్తుండటంతో మళ్లీ యుద్ధవాతావరణం నెలకొందంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. వైద్య సిబ్బంది రిలాక్స్ అవకుండా నిరంతరం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటెల రాజేందర్, సెక్రెటరీ రీజ్వి, డీఎంఈ రమేష్ రెడ్డిలతో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

అన్ని ఆసుపత్రుల్లో పీపీఈ కిట్స్, రిమెడ్స్విర్ ఇంజెక్షన్లు, ఎన్-95 మాస్క్‌లు, లిక్విడ్ ఆక్సిజన్ టాంక్‌లు, బల్క్ సిలెండర్‌లు, టాబ్లెట్స్, డాక్టర్లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఎంత మంది సిబ్బంది అవసరమైతే అంత మందిని తాత్కాలిక పద్దతిలో తీసుకోవాలని అనుమతులిచ్చారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్‌తో, జిల్లా వైద్య అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం గ్రామస్థాయిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపారు.

గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరినీ, ప్రతి రోజూ పరిశీలనలు చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న సిబ్బంది సెలవులు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం కూడా వాక్సిన్ వేయాలని చెప్పారు. ప్రజా జీవనం యథావిధంగా కొనసాగిస్తూనే కరోనా నియంత్రణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న అన్ని జిల్లాల వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ.. వాక్సిన్ కొరత లేదని అందరికీ వాక్సిన్ అందుతుందని స్పష్టం చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని, ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను టార్గెట్ మించి నిర్వహించాలని తెలిపారు.



Next Story