జులైలో ఐపీఎల్ నిర్వహణకు సన్నద్ధం !

by  |
జులైలో ఐపీఎల్ నిర్వహణకు సన్నద్ధం !
X

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ లేదు. కొవిడ్ మహమ్మారి కారణంగా మార్చి 29న ప్రారంభం కావల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్ 15న కూడా ప్రారంభం కావడం దాదాపు అసాధ్యమే. కాగా, ఐపీఎల్‌ను జులైలో గానీ, నవంబర్ తర్వాత గానీ నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. కరోనా కారణంగా ఈ ఏడాది లీగ్ రద్దు చేయడమే మంచిదని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ భావిస్తోంది. కానీ బీసీసీఐ, బ్రాడ్‌కాస్టర్స్, ఫ్రాంచైజీలతో ఉన్న ఆర్థిక లావాదేవీలు లీగ్ రద్దుకు అడ్డుపడుతున్నాయి. ఎలాగైనా ఐపీఎల్ నిర్వహించాలనుకుంటే స్టేడియంలోకి ప్రేక్షకులను, అభిమానులను అనుమతించకుండా ఆడించడమే చివరి ఆప్షన్ అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు తెలపడం గమనార్హం.

ఈ ఏడాది కనుక ఐపీఎల్ నిర్వహించకపోతే రూ. 47,500 కోట్ల విలువ కలిగిన లీగ్ రూ.5000 నుంచి రూ. 7,500 కోట్ల వరకు నష్టపోతుందని డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రూ. 3269.50 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు టైటిల్ స్పాన్సర్ వీవో రూ.400 కోట్ల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. వీటన్నింటితో పాటు ఫ్రాంచైజీలు కూడా భారీగానే నష్టపోవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ఏదో ఒక సమయంలో ఐపీఎల్ నిర్వహించి నష్టాలను కొంత మేరైనా తగ్గించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

Tags: BCCI, IPL, Star sports, Broadcasters, Governing body


Next Story

Most Viewed