టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్ కాంట్రాక్టుపై వివాదం

by  |
టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్ కాంట్రాక్టుపై వివాదం
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా కిట్ స్పాన్సర్‌గా ఉన్న నైకీ తన 16 ఏళ్ల బంధాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెంచుకున్నది. తమ కాంట్రాక్టును పొడిగించలేమని బీసీసీఐకి తేల్చి చెప్పడంతో కొత్త స్పాన్సర్‌ను వెతికే పనిలో పడింది. ఆస్ట్రేలియా పర్యటన దగ్గరకు వస్తుండటంతో స్పోర్ట్స్ వేర్, యాక్ససరీస్ సంస్థ ‘ఎంపీఎల్’తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నది. 2020 నవంబర్ నుంచి 2023 నవంబర్ వరకు ఈ ఒప్పందం అమలులో ఉండనుంది.

టీమ్ ఇండియా పురుషులు, మహిళా జట్లతోపాటు అండర్-19, ఇండియా ‘ఏ’ జట్లకు జెర్సీ, కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. గతంలో నైకీ మ్యాచ్‌కు రూ.88 లక్షలు ఇచ్చేది. అయితే, ఎంపీఎల్ మాత్రం మ్యాచ్‌కు రూ.65 లక్షలకే ఒప్పందం కుదుర్చుకున్నది. కాగా, ఈ ఒప్పందంపై వివాదం చెలరేగింది. బీసీసీఐ ఎలాంటి బిడ్లు పిలవకుండానే నేరుగా ఎంపీఎల్‌కు కాంట్రాక్టు కట్టబెట్టిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. ‘ఈ ఏడాది ఆగస్టులోనే కిట్ స్పాన్సర్ కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు కోరాము. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పేరుతో బీసీసీఐ వెబ్‌సైట్లో కూడా బిడ్ డాక్యుమెంట్ ఉంచాము. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నిబంధనల ప్రకారం నేరుగా కిట్ స్పాన్సర్‌ను ఎంపిక చేశాము. ఆస్ట్రేలియా పర్యటనకు సమయం తక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేద’ని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed