రేపే BCCI సమావేశం.. పలు అంశాలపై కీలక నిర్ణయం..

by  |
రేపే BCCI సమావేశం.. పలు అంశాలపై కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు BCCI పలు సవాళ్లు ఉన్న సమయంలో కీలకమైన సర్వసభ్య సమావేశం శనివారం కోల్‌కతా వేదికగా జరుగనున్నది. దక్షిణాఫ్రికా పర్యటన, అహ్మదాబాద్ జట్టు అనిశ్చితి, వేలంపాట తేదీ నిర్ణయం, టీమ్ ఇండియా భవిష్యత్ పర్యటనల ఖరారు వంటి కీలక విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ దుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో పాటు బోర్డులోని అందరూ సభ్యులు ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా దక్షిణాఫ్రికా పర్యటనపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తీవ్రత వేగంగా వ్యాపిస్తుండటంతో దక్షిణాఫ్రికా పర్యటనను కుదించాలా? వాయిదా వేయాలా? లేదంటే మొత్తానికే రద్దు చేయాలా అనే విషయంపై ఈ సమావేశంతో స్పష్టత రానున్నది.

వేలం పాట ఎప్పుడో ?

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన నిబంధనల ప్రకారం నవంబర్ 30కి ప్లేయర్స్ రిటెన్షన్ ముగియాలి. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి 25 వరకు కొత్త జట్లకు ఫ్రీ పిక్ ఆప్షన్ అమలు చేయాల్సి ఉన్నది. అయితే రిటెన్షన్లు పూర్తయి నాలుగు రోజులు గడిచినా ఇంకా ‘ఫ్రీ పికప్’ మొదలు కాలేదు. దీనికి అసలైన కారణం అహ్మదాబాద్ జట్టుకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించకపోవడమే. ఇప్పటికే నలుగురు స్వతంత్ర సభ్యులతో కూడిన కమిటీ అహ్మదాబాద్ వెనుక ఉన్న సీవీసీ క్యాపిటల్‌పై విచారణ జరుపుతున్నది. దీని నివేదిక BCCI ఏజీఎంలో ప్రవేశపెడతారు. అందులోనే అహ్మదాబాద్ జట్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త జట్ల అనిశ్చితికి తెరపడిన తర్వాత ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ డేట్ కూడా నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది.

టీ20 వరల్డ్ కప్ ప్రదర్శనపై చర్చ..

టీమ్ ఇండియా ఇటీవల యూఏఈ వేదికగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన చేసింది. కనీసం సూపర్ 12 స్టేజ్ కూడా దాటలేకపోయింది. జట్టులోని పలువురు క్రికెటర్లు పూర్తి ఫిట్‌గా కూడా లేరు. ఈ విషయంలో బోర్డు సభ్యులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. దీనిపై పూర్తి బాధ్యతను ఎవరు తీసుకోవాలనే విషయంలో చర్చ జరుగనున్నది. ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌కు ఎన్ఏసీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడ నేషనల్ క్రికెట్ అకాడమీలోని కోచ్‌లు, ఇతర సిబ్బంది కాంట్రాక్టుల రెన్యూవల్‌పై కూడా చర్చ జరుగనున్నది. దీంతో పాటు సెలెక్టర్ల పదవీ కాలం పొడిగింపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక ఈ సమావేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌పై కీలక చర్చ జరుగనున్నది. ఈ ఏడాది జూన్‌లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం పర్యటించింది. అయితే 4 మ్యాచ్‌లు సక్రమంగా జరిగినా.. ఆఖరి టెస్టు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. రద్దైన టెస్టును ఎలా నిర్వహించాలనే విషయంలో కూడా BCCI చర్చ జరుపనున్నది. దీంతో పాటు భారత జట్టు భవిష్యత్ పర్యటనలపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story

Most Viewed