పాలమూరులో ఘనంగా బతుకమ్మ వేడుక.. మెరిసిన ప్రముఖులు

by  |
పాలమూరులో ఘనంగా బతుకమ్మ వేడుక.. మెరిసిన ప్రముఖులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పూల’ పండుగ బతుకమ్మ సంబురాలతో పల్లెలు, పట్టణాలు పులకరించి పోతున్నాయి. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేడుకలు వైభవంగా సాగాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న భారం బావి వద్ద నిర్వహించిన వేడుకలు కన్నుల పండువగా సాగాయి. రకరకాల పూలతో తయారు చేసిన బతకమ్మలతో వందలాదిగా తరలి వచ్చిన మహిళలు భారం బావి వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌ పర్సన్ మజా ఆంజనేయులు గౌడ్, జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ డాక్టర్ చైతన్య, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ తదితరులు హాజరై బతుకమ్మ పండగ ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. సాయంత్రం నుండి రాత్రి వరకు వేడుకలు సాగాయి. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో నారాయణపేట పట్టణమంతా జనమయంగా మారింది.

పాలమూరులో పరవశం..

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సతీమణి శారద, జిల్లా కలెక్టర్ సతీమణి రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై జిల్లా మహిళా అధికారులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, డీఆర్ఓ స్వర్ణలత, ఆర్డీఓ పద్మశ్రీ తదితరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయంలోనూ అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా వేడుకలను నిర్వహించారు. పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఆయన సతీమణి నీలం రాథోడ్ పూజలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను ప్రధానం చేశారు.

Next Story

Most Viewed