శుభవార్త చెప్పిన కేసీఆర్.. త్వరలో మీ అకౌంట్లలోకి నగదు

by  |
శుభవార్త చెప్పిన కేసీఆర్.. త్వరలో మీ అకౌంట్లలోకి నగదు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ వారం, పది రోజుల్లో రైతుబంధు సాయం బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానానికి వంద శాతం రైతులు సమ్మతి తెలియజేశారని, ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు కూడా వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతుబంధు అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,500 కోట్లను వ్యవసాయ శాఖకు జమ చేసిందని, మిగిలిన రూ.1,500 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనుందని తెలిపారు. నియంత్రిత సాగుపై ప్రగతి భవన్‌లో సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. ఒక్క ఎకరా కూడా మిగలకుండా, ఒక్క రైతును కూడా వదిలేయకుండా అందరికీ వారం, పది రోజుల్లోనే రైతుబంధు సాయాన్ని వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి రాష్ట్రం మొత్తం మీద 1.25 కోట్ల ఎకరాల్లో సాగు జరగనున్నదని పేర్కొన్నారు. ఇందులో 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోందన్నారు.

ఇది గొప్ప ముందడుగు

ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాలంలో 41,76,778 ఎకరాల్లో వరి, 60,16,079 ఎకరాల్లో పత్తి, 12,31,284 ఎకరాల్లో కందుల సాగుకు సిద్ధమయ్యారని ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 4,68,216 ఎకరాల్లో సోయాబీన్, 1,53,565 ఎకరాల్లో జొన్నలు, 1,88,466 ఎకరాల్లో పెసర్లు, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదం, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధం కావడం పట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. “రైతులంతా ఈ విధానాన్ని అనుసరించాలనుకోవడం గొప్ప ముందడుగు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేయడానికి, దేశానికి ఆదర్శంగా నిలవడానికి అమలు చేస్తున్న నియంత్రిత సాగు విధానంలో మన రైతులు గొప్పగా తొలి అడుగు వేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలుస్తుంది. రైతును రాజు చేయాలన్నదే ప్రభుత్వం అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవడానికి మంచి ప్రారంభం లభించింది’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “దేశంలోనే తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా మారింది. భవిష్యత్తులో వ్యయసాయాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం సంకల్పం. నియంత్రిత పద్ధతిలో పంటసాగు విధానం అమలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకం చేసింది. వ్యవసాయరంగం సుస్థిరంగా నిలబడాలని, వ్యవస్థీకృతం కావాలని, రైతులకు స్థిరమైన ఆదాయం రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. అందుకోసమే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాలని కోరింది. దానికి రాష్ట్ర రైతాంగం అద్భుతంగా స్పందించింది. ప్రభుత్వం చెబుతున్నది తమ కోసమే అని రైతులు అర్థం చేసుకున్నారు” అని సీఎం వివరించారు. మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ఈ విధానాన్ని ప్రతిపాదించిందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటికే వ్వయసాయ పనులు ప్రారంభమైనందున రైతు పెట్టుబడి అవసరాల కోసం ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కావద్దన్నారు. అందుకే రైతుబంధు సాయం పంపిణీ తక్షణం ప్రారంభం కావాలన్నారు.

యాసంగిలోనూ ఇలాగే

వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలవారీగా పంటల సాగు పరిస్థితిని, వ్యవసాయాధికారులు పంపిన నివేదికను ఈ సమావేశంలో సీఎం పరిశీలించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం సూచించిన విధంగానే పంటల సాగు జరుగుతున్నట్లు తేలింది. ప్రభుత్వం సూచించిన పంటలు వేసుకోవడానికి అనుగుణంగానే రైతులు విత్తనాలను కూడా కొనుగోలు చేసినట్లు సీడ్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. “గత యాసంగిలో 53.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఈసారి ప్రాజెక్టుల ద్వారా వచ్చే సాగునీటితో పాటు, మంచి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున మరో 10-12 లక్షల ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాకాలంలో వద్దని చెప్పిన మక్కలు యాసంగిలో సాగు చేసుకోవాలి. 45 లక్షల ఎకరాల్లో వరి, ఆరేడు లక్షల ఎకరాల్లో మక్కలు, నాలుగు లక్షల ఎకరాల్లో శనగలు, ఐదు లక్షల ఎకరాల్లో వేరుశనగ (పల్లి), లక్షన్నర ఎకరాలలో కూరగాయలు సాగు చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. దీనికి సంబంధించిన విత్తనాలను కూడా అందుబాటులోకి తేవాలి. వరిలో సన్న, దొడ్డు రకాలను కూడా రైతులకు సూచించాలి. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతాయి. వేరుశనగ, శనగ విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేయాలి. నియంత్రిత పంట సాగు విధానం అంటే ఇదే. ముందే ప్రణాళికలు సిద్ధం చేసుకుని, దానికి అనుగుణమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవడం” అని సీఎం స్పష్టం చేశారు.

Next Story

Most Viewed