'కేసీఆర్ సారూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరు..?'

by  |
కేసీఆర్ సారూ.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరు..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ కి వరుస లేఖలు రాస్తున్నారు. తాజాగా బుధవారం డబుల్ బెడ్రూంల అంశాన్ని లేవనెత్తారు. లేఖలో ‘‘ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం.. అల్లుడు బిడ్డా వస్తే తలదాచుకునేదెలా? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇండ్లు ఇచ్చింది.

టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని, 2014, 2018 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కదా.. ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని 4 నెలల్లో పూర్తి చేయిస్తా అన్న హామీ మీకు గుర్తుందా కేసీఆర్ సారూ.. 2018 ఎన్నికల్లో సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నుంచి 6 లక్షల వరకూ ఇస్తామని హామీ ఇచ్చారు.. ఒక్కరికైనా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందా..? కేంద్ర ప్రభుత్వం 2.91 లక్షల ఇండ్లు తెలంగాణకి మంజూరు చేస్తే.. అందులో ఎన్ని ఇండ్లు పూర్తి చేశారు. వాటి వివరాలు ఇవ్వగలరా?.. కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను నిర్మించి ఇస్తే.. తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో మరో 10 లక్షల ఇండ్లను మంజూరు చేయించుకొస్తుంది.

వందల కోట్లతో ఇంద్రభవనంగా ప్రగతి భవన్ ను నిర్మించుకుంటారు.. కానీ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించలేరా? 2014 సమగ్రసర్వే ఆధారంగా.. రాష్ట్రంలోని 26.31 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలకు 7 ఏళ్లైనా కట్టివ్వలేకపోతున్నారు. ఇదేనా పేదల పట్ల మీకున్న ప్రేమ. డబుల్ బెడ్రూం ఇండ్లకు గత ఏడేళ్లలో కేటాయించిన బడ్జెట్ ఎంత, ఖర్చు ఎంత, కేంద్ర నిధులు ఎన్ని.. ఈ వివరాలు అందించగలరా?. గజ్వేల్, సిరిసిల్ల , సిద్దిపేట నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. మిగతా 116 నియోజకవర్గాల్లో ఎన్ని నిర్మించారు.’’ అని లేఖలో బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed