కేసీఆర్ పల్లకి మోస్తా: బండి సంజయ్

by  |
కేసీఆర్ పల్లకి మోస్తా: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనపై సీఎం కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏవేవో లెక్కలు చెప్తున్నారని, కనీసం ఇప్పుడైనా శ్వేతపత్రం విడుదల చేస్తే, ఇంతకాలం చెప్తూ వచ్చిన లెక్కలు నిజమే అయితే ఆయన పల్లకీ మోస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత గడచిన ఆరున్నరేళ్ళ కాలంలో మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్తోందని, ఇవన్నీ కాకి లెక్కలేనన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా మూడు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినట్లయితే వాటి వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

కరోనా కట్టడి విషయంలోనూ కేసీఆర్ రెండు నాల్కల ధోరణి అవలంభించారని బండి సంజయ్ ఆరోపించారు. కరోనా మహమ్మారిని కేసీఆర్ చులకనగా మాట్లాడారని, పారాసిటమాల్ మాత్ర సరిపోతుందన్నారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ ఆలోచన మేరకు కరోనాను అదుపు చేయగలిగామని, మృతుల సంఖ్యను బాగా తగ్గించగలిగామన్నారు. కరోనా సమయంలోనే ‘ఆయుష్మాన్ భారత్‌’ను అమలు చేసినట్లయితే పేదలు ప్రాణాలు కోల్పోయేవారే కాదన్నారు. అటు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సంజయ్ మాట్లాడుతూ, కబ్జాదారులను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, ఎలాంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం మూడో టీఎంసీ విస్తరణ పనులు చేపడుతోందని ఆరోపించారు.

రెండు లక్షల పోస్టులున్నా కేసీఆర్ భర్తీ చేయలేదు: తరుణ్ చుగ్
సుమారు రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని ఇంతకాలం భర్తీ చేయలేకపోయిన అసమర్థ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, తన కుటుంబాన్ని మాత్రమే బంగారంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. నిజమైన బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దం కావాలని కార్యకర్తలకు తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్ళూ బీజేపీకి ఉద్యమాలు చేసే కాలమన్నారు. గడచిన ఆరున్నరేళ్ళలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు చెప్పగలరా అని తరుణ్ చుగ్ సవాలు విసిరారు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఏడేళ్ళలో చేసిన ప్రతి పనికీ లెక్కలు చెప్తామని, కేసీఆర్ ఆ సాహసం చేయగలరా అని నిలదీశారు.


Next Story

Most Viewed