రాయలసీమ ఎత్తిపోతలతో అన్యాయమే.. కేంద్రానికి బండి సంజయ్ లెటర్

by  |
Bandi-sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టులు తెలంగాణ నీటి హక్కులను హరిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‎కు బండి సంజయ్​శనివారం లేఖ రాశారు. బచావత్‌ అవార్డులో ప్రస్థావనే లేని ప్రాజెక్టులను ముందు పెట్టి భారీ ఎత్తున నీటిని తరలించుకుపోతుందని, విభజన చట్టాన్ని అతిక్రమించి, అపెక్స్‌ కౌన్సిల్‌ సహా ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని లేఖలో వివరించారు.

ఇప్పటికే 50 శాతానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, వెంటనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్‌లో రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారని, అపెక్స్​ కౌన్సిల్‎లో సూచించినప్పటికీ.. ఎనిమిది నెలల తర్వాత సుప్రీం కోర్టు కేసును విత్‌ డ్రా చేసుకోవడానికి సీఎం కేసీఆర్‌ పిటిషన్​ దాఖలు చేశారని, దీంతో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమైందన్నారు. కేంద్రం వీలైనంత త్వరగా నీటి పంపకాల కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, కృష్ణా రివర్ బోర్డు పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడాలంటే కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కాపాడుకోవడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని, రాష్ట్ర హక్కులు కాపాడేందుకు చొరవ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు వెంటనే కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని నోటిఫై చేయాలని, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ నీళ్ల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారే తప్ప రాష్ట్రాల హక్కులను కాపాడాలని కాదని పేర్కొన్నారు. నీళ్ల వివాదాలతో ఇద్దరు సీఎంలు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణాపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆరే అవకాశమిచ్చి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల టెండర్లు పూర్తి అవ్వాలనే రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయించారని, బచావత్‌ అవార్డు (కేడబ్ల్యూడీటీ -1) ప్రకారం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉందని ఈ సందర్భంగా వివరించారు. బ్రిజేష్​ కుమార్‌ ట్రిబ్యునల్‌ తన అవార్డును 2010లోనే ప్రకటించినా సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీళ్లలో 68.5 శాతం పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 555 టీఎంసీలు దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలు తాత్కాలిక వాటాగా కేటాయించారన్నారు. ఏపీకి 512 టీఎంసీలు దక్కాయని, కృష్ణాలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా రాలేదని, ఇప్పటికైనా న్యాయమైన వాటా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుల పరిధి ఇంకా నోటిఫై కాలేదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed