ఈటల ముక్కు నేలకు రాయాలి.. బాల్క సుమన్ డిమాండ్

by  |
ఈటల ముక్కు నేలకు రాయాలి.. బాల్క సుమన్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీతి, నిజాయితీ అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను కబ్జా చేశారని, మెదక్ జిల్లా కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీల భూములను అడ్డగోలుగా కబ్జా చేసినట్లు రుజువైందని అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి, పేదల భూములను పేదవారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయో కలెక్టర్ నిగ్గు తేల్చాలని కోరారు.

తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్ చెప్పారని, ఇప్పుడు తప్పు రుజువైందన్నారు. ఈటల రాజేందర్ ముక్కు నేలకు రాయాలని బాల్క సుమన్ తెలిపారు. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల నిజస్వరూపాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నారని, కానీ అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్, అతని భార్య మాట్లాడిన తీరును బాల్క సుమన్ ఖండించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భూములను కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న ఈటల రాజేందర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed