5 కోట్ల అల్లూరిలు గర్జించాలంట.. ట్విట్టర్‌లో బాబు

by  |
5 కోట్ల అల్లూరిలు గర్జించాలంట.. ట్విట్టర్‌లో బాబు
X

దిశ, ఏపీ బ్యూరో: అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ మాధ్యమంగా అమరావతి రైతులు ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. అల్లూరి పోరాట స్ఫూర్తితో అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళదామని పిలుపునిచ్చారు. ‘మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్లం కాదు. స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ‘అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది’ అని పిలుపునిచ్చారు.

టీడీపీ నేత లోకేశ్‌ కూడా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఈరోజు రాజధాని ప్రాంత ప్రజలపై వైసీపీ ప్రభుత్వం సాగిస్తోన్న దారుణ మారణకాండ మాదిరిగానే… ఆరోజు మన్నెం ప్రజల హక్కులను తెల్లదొరలు కాలరాశారు. అయితే, నాడు గిరిజనులందరినీ ఏకం చేసి తెల్లవారి గుండెలదిరేలా చేశారు అల్లూరి సీతారామరాజు. నాటి అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకునే కథానాయకులై రాజధాని అమరావతి రైతులకు అండగా నిలవాలి. అల్లూరి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed